ఒక్కరోజే రూ.6.71 లక్షల కోట్ల సంపద ఆవిరి
భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
సెన్సెక్స్ 1,416, నిఫ్టీ 431 పాయింట్లు డౌన్
తీవ్ర అమ్మకాల ఒత్తిడిలో ఐటీ షేర్లు
ముంబై, మే 19: స్టాక్ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల సంకేతాలు గురువారం దేశీయ సూచీల ఉసురు తీశాయి. దీంతో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. రెండేండ్ల నుంచి గమనిస్తే.. రిటైల్ ద్రవ్యోల్బణం అమెరికాలో భారీగా పెరగడంతో వాల్స్ట్రీట్పై ఆ ప్రభావం కనిపించింది. ఇది భారత్సహా ప్రపంచ మార్కెట్లనూ కుప్పకూల్చింది. మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలతో విదేశీ మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం కూడా మార్కెట్ సెంటిమెంట్ను బలహీనపర్చింది. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 1,416.3 పాయింట్లు లేదా 2.61 శాతం పతనమై 52,792.23 వద్ద ముగిసింది. గడిచిన రెండు నెలలకుపైగా కాలంలో ఇదే గరిష్ఠం. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 430.9 పాయింట్లు లేదా 2.65 శాతం క్షీణించి 15,809.4 వద్ద నిలిచింది. ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.6,71,051.73 కోట్లు కరిగిపోయి రూ.2,49,06,394.08 కోట్లకు చేరింది. సెన్సెక్స్లో విప్రో షేర్ విలువ అత్యధికంగా 6.21 శాతం నష్టపోయింది. హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లూ నిరాశపర్చాయి. ఐటీసీ, డాక్టర్ రెడ్డీస్, పవర్గ్రిడ్ షేర్లు లాభపడ్డా సూచీల నష్టాలను అడ్డుకోలేకపోయాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలూ 2.66 శాతం, 2.29 శాతం చొప్పున పడిపోయాయి.
వాల్స్ట్రీట్ దెబ్బకు గ్లోబల్ మార్కెట్ ఠా
అమెరికాలోని వాల్స్ట్రీట్ నష్టాలు.. ఆసియా, ఐరోపా దేశాల్లోని మెజారిటీ స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయి. దక్షిణ కొరియా, హాంకాంగ్, జపాన్ సూచీలు నష్టపోగా, చైనా సూచీ మాత్రం లాభపడింది. అలాగే ఐరోపాలోని ప్రధాన సూచీలైన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
రూపాయి విలవిల
ఆల్టైమ్ కనిష్ఠానికి పతనం
77.65 స్థాయికి చేరిక
డాలర్తో పోల్చితే రూపా యి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా క్షీణించింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో మరో 3 పైసలు పడిపోయి 77.65 స్థాయికి చేరింది. స్టాక్ మార్కెట్ల నష్టాలు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో డాలర్కు డిమాండ్ను తెచ్చిపెట్టాయి. బుధవారం కూడా రూపాయి మారకం 18 పైసలు పతనమైన విషయం తెలిసిందే.
నష్టాలకు కారణాలివే..
దేశీయ స్టాక్ మార్కెట్లు 2.6 శాతానికిపైగా దిగజారాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమెరికాలో వడ్డీరేట్లు మరింత వేగంగా పెరుగుతాయన్న భయాలు మదుపరులను వెంటాడాయి. ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి విపరీతంగా నమోదైంది. –అజిత్ మిశ్రా, రెలిగేర్ బ్రోకింగ్ రిసెర్చ్ ఉపాధ్యక్షుడు