Adani Group | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అదానీ గ్రూప్ కంపెనీలు దేశంలో తీసుకున్న రుణాలు, జారీచేసిన బాండ్లకు నిర్దేశించిన రేటింగ్స్ వివరాలివ్వాలంటూ క్రెడిట్ రేటింగ్ సంస్థల్ని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కోరింది. ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం అదానీ కంపెనీలకు ఇచ్చిన రేటింగ్స్, వాటి అవుట్లుక్లతో పాటు ఈ వాణిజ్య గ్రూప్ అధికారులతో చర్చలు జరిపి ఉంటే వాటి అప్డేట్స్పై సమాచారాన్ని తెలియపర్చాలంటూ సెబీ ఆదేశించింది. అదానీ కంపెనీల షేర్లు నిలువునా పతనంకావడానికి వాటి నగదు నిల్వల పరిస్థితి, రుణ చెల్లింపు సామర్థ్యం కారణమా అనే అంశాన్ని మదింపు చేసేందుకు సెబీ ప్రయత్నిస్తున్నదని సంబంధిత వ్యక్తి ఒకరు తెలిపారు. అదానీ గ్రూప్పై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల తర్వాత అదానీ కంపెనీల షేర్లు తీవ్ర పతనాన్ని చవిచూసాయి. అయినప్పటికీ అదానీ కంపెనీల రేటింగ్స్ అవుట్లుక్లో దేశీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు ఎటువంటి మార్పులూ చేయలేదు.
ఏదైనా కంపెనీ రుణ సమీకరణ కోసం జారీచేసే వాణిజ్య పత్రాలు, బాండ్లపై రేటింగ్ ఏజెన్సీలు ఇచ్చే రేటింగ్ ఆధారంగానే మ్యూచువల్ ఫండ్స్, విదేశీ ఫండ్స్, ఇన్వెస్టర్లు వాటిని కొనుగోలు చేస్తారు. మార్కెట్ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు, కంపెనీలు వ్యాపారం చేసే రంగాల పనితీరు, కంపెనీల లాభనష్టాలు…ఇలాంటివాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రేటింగ్స్లో, రేటింగ్ అవుట్లుక్లో మార్పుల్ని రేటింగ్ ఏజెన్సీలు వెల్లడిస్తుంటాయి. అలాగే సాధారణంగా షేరు ధర అనూహ్యంగా పడిపోయిన అంశాన్ని సైతం రేటింగ్ ఏజెన్సీలు ‘మెటీరియల్ ఈవెంట్’గా పరిగణనలోకి తీసుకుని బాండ్లు జారీచేసిన కంపెనీ రేటింగ్ను, అవుట్లుక్ను సమీక్షిస్తుంటాయి. అందుకు అనుగుణంగా ఆయా కంపెనీల పత్రాల్ని ‘రేటింగ్ వాచ్’లో పెడతాయి. అయితే రేటింగ్ మార్పు కోసం హిండెన్బర్గ్ రిపోర్ట్ను మెటీరియల్ ఈవెంట్గా ఏజెన్సీలు పరిగణనలోకి తీసుకోకపోవచ్చని బ్యాంకరు ఒకరు తెలిపారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు ఎస్ అండ్ పీ, మూడీస్ మాత్రమే కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల రేటింగ్ను ‘స్టేబుల్’ నుంచి ‘నెగిటివ్’కు డౌన్గ్రేడ్ చేశాయి. ఆయా కంపెనీల మార్కెట్ విలువ వేగంగా పతనంకావడమే ఈ రేటింగ్ మార్పునకు కారణం.