BSE Sensex : భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. రూపాయి విలువ అత్యంత కనిష్టానికి పతనమవడం, క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్లపై దుష్ప్రభావం చూపింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 160.73 పాయింట్లు (0.21 శాతం) నష్టపోయి 75,237.99 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 కూడా 46.10 పాయింట్లు (0.19 శాతం) నష్టపోయి 23,643.50 వద్ద ముగిసింది.
రూపాయి విలువ తగ్గడం, చమురు ధరలు పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయం వంటివి ఇన్వెస్టర్లపై ప్రభావం చూపాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగడం, హార్ముజ్ జలసంధి పూర్తి స్ధాయిలో తెరుచుకోకపోవడం వంటివి కూడా ఇందుకు కారణాలు. ఈ కారణాలతో చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడాయిల్ ధర 109 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు భారతీయ రూపాయి అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. డాలర్తో రూపాయి విలువ 96.05 వద్ద ట్రేడవుతోంది. అంతకుముందు ఇది 95.9575 వద్ద కొనసాగింది. రూపాయి అత్యంత తక్కువ స్థాయికి చేరుకోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపింది.
రూపాయి ఇంత తక్కువ స్థాయికి పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రోజు 0.3 శాతం తగ్గింది. చమరు ధరల పెరుగుదల, విదేశీ ద్రవ్యం అధికం కావడం, పశ్చిమాసియాలో అస్థిరత వంటివి రూపాయి పతనానికి కారణాలు. ఇండియా చమురు దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, అమెరికా వడ్డీ రేట్లు, మారక నిల్వలు తగ్గడం కూడా కారణాలుగా చెప్పుకోవచ్చు.