Indian Rupee | ముంబై, జనవరి 13 : డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ దారుణంగా క్షీణించింది. సోమవారం ఒక్కరోజే ఏకంగా 66 పైసలు దిగజారింది. దాదాపు గత రెండేండ్లలో ఈ స్థాయిలో ఎప్పుడూ పడిపోకపోవడం గమనార్హం. 2023 ఫిబ్రవరి 6న 68 పైసలు పతనమైంది. మళ్లీ ఇప్పుడే అంతటి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ వద్ద రూపీ వాల్యూ 86.70 స్థాయికి చేరి ఆల్టైమ్ కనిష్ఠాన్ని తాకింది.
నిజానికి గతకొద్ది రోజులుగా డాలర్ ఎదుట ఏమాత్రం నిలదొక్కుకోలేకపోతున్న భారతీయ కరెన్సీ.. రోజుకింత క్షీణిస్తూ ఆల్టైమ్ కనిష్ఠాల్లోనే కదలాడుతున్నది. కాగా, అమెరికా మార్కెట్లో అంచనాల్ని మించి ఉద్యోగ వృద్ధి నమోదవడం.. డాలర్కు ఒక్కసారిగా డిమాండ్ను తెచ్చిపెట్టిందని ఫారెక్స్ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే రూపాయి విలువ పతనం.. ఎగుమతిదారులకు పరిమిత శ్రేణిలోనే ప్రయోజనాలను తెచ్చిపెడుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత వాతావరణం నెలకొనడం ఇందుకు కారణాలుగా వారు పేర్కొంటున్నారు. మరోవైపు రూపాయి నష్టం.. దేశ ఆర్థిక వ్యవస్థకూ దెబ్బేనని, ద్రవ్యోల్బణం విజృంభణకు దారితీయవచ్చని కూడా వారు హెచ్చరిస్తున్నారు.
రూపీ నష్టాలకు బ్రేక్ పడకపోతే సంక్షోభం ముప్పు ఖాయమన్న ఆందోళనల్నీ వెలిబుచ్చుతున్నారు. మరోవైపు రూపాయి పతనం రాజకీయంగానూ ప్రకంపనల్ని సృష్టిస్తున్నది. అధికార బీజేపీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థిరంగా ఉన్న కరెన్సీల్లో రూపాయి ఒకటని అంటుండగా, కాంగ్రెస్ మాత్రం మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నది.