RBI-Rs 500 | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వద్ద రూ.88,032.5 కోట్ల విలువ గల రూ.500 కరెన్సీ నోట్ల సమాచారం లేదని తేలింది. మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన ఆర్టీఐ పిటిషన్కు ఇచ్చిన సమాధానంతో ఈ సంగతి బయట పడింది. 2016 నవంబర్ ఎనిమిదో తేదీన పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500కరెన్సీ నోట్లు) రద్దు చేసిన తర్వాత కొత్తగా రూ.500 నోట్లు తెచ్చారు. దేశవ్యాప్తంగా కల మూడు ప్రింటింగ్ ప్రెస్ల్లో 8,810.65 మిలియన్ల విలువ గల రూ.500 నోట్ల ముద్రణ జరిగింది. అందులో కేవలం 7260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్బీఐ వద్దకు చేరాయని మనో రంజన్ రాయ్ ఆర్టీఐ పిటిషన్కిచ్చిన సమాధానంలో తెలిపారు. మిగతా 1550.65 మిలియన్ల నోట్ల సమాచారం ఆర్బీఐ వద్ద అందుబాటులో లేదు.
బెంగళూరులోని భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ లిమిటెడ్, నాసిక్లోని కరెన్సీ నోట్ప్రెస్, మధ్యప్రదేశ్ లోని దేవాస్ లోని బ్యాంక్ నోట్ప్రెస్లో దేశీయ అవసరాలకు కరెన్సీ నోట్లు ముద్రిస్తారు. 2016-17లో నాసిక్ మింట్లో 1662 మిలియన్ల రూ.500 నోట్లు, బెంగళూరులో 5195.65 మిలియన్లు, దేవాస్లో 1953 మిలియన్ల నోట్లు ముద్రించడం జరిగిందని ఆర్టీఐ రిప్లయ్లో తెలిపింది. కానీ, తమకు 7260 మిలియన్ల నోట్లు మాత్రమే అందాయని ఆర్బీఐ వెల్లడించింది.
2016 నవంబర్ ఎనిమిదో తేదీన పాత పెద్ద నోట్లు రద్దు చేయడానికి ముందే 2015 ఏప్రిల్ నుంచి 2016 డిసెంబర్ మధ్య నాసిక్ ప్రింటింగ్ ప్రెస్లో 375.450 మిలియన్ల కొత్త రూ.500 నోట్లు ముద్రిస్తే, ఆర్బీఐకి 345 మిలియన్ల నోట్లు మాత్రమే వచ్చాయి. అలా కనిపించకుండా పోయిన 1550.65 మిలియన్ల నోట్లలో 210 మిలియన్ల నోట్లు 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్య ముద్రించినట్లు తేలింది.