Investers Wealth | అమెరికా ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచేయడం.. మరోవైపు వివిధ వస్తువుల ధరలు పెరిగిపోయాయి. విదేశీ మార్కెట్లలో బలహీనతల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి. వరుసగా ఐదు రోజులుగా భారీ పతనాన్ని చవి చూస్తున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు రూ.15.74 లక్షల కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ ఐదు రోజుల్లో 3824.49 (6.91 శాతం) పాయింట్లు నష్టపోయింది. ఫలితంగా బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,74,931.56 కోట్లు నష్టపోయి రూ.2,39,20,631.65 పాయింట్లకు చేరింది. గురువారం ట్రేడింగ్లో 2.12 శాతం (1,115.91 పాయింట్లు) కోల్పోయి 51,425.48 పాయింట్లకు చేరుకున్నది. ఇది ఏడాది కాల కనిష్టం.
నెస్ట్లే ఇండియా మినహా అన్ని సెన్సెక్స్లోని స్టాక్స్ నష్టాలతోనే ముగిశాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, విప్రో, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఎన్టీపీసీ నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 2.87 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.34 శాతం నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈలో సెక్టార్ల వారీగా మెటల్ 5.48 శాతం, బేసిక్ మెటీరియల్స్ 3.55, ఇండస్ట్రీయల్స్ 3.06, టెలికం 3.04, రియాల్టీ 2.69, టెక్ (2.51), ఐటీ 2.48 శాతం, యుటిలిటీస్ 2.39 శాతం నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈలోని 2754 స్టాక్స్ నష్టపోగా, 620 స్క్రిప్ట్లు పుంజుకున్నాయి. 100 స్టాక్స్స్ మాత్రం స్థిరంగా కొనసాగాయి. మరోవైపు బుధవారం వరకు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐ) స్టాక్ మార్కెట్ల నుంచి రూ.3,531.15 కోట్ల విలువైన షేర్లు విక్రయించేశారు.