Home Loans | మీరు హోంలోన్ తీసుకుంటున్నారా.. అయితే ఇంటి రుణం తీసుకున్న వారికి భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) తీపి కబురందించింది. ఇప్పుడు ఇండ్ల రుణాలపై ఫ్లోటింగ్, ఫిక్స్డ్ వడ్డీరేట్లు అమల్లో ఉన్నాయి. ఇండ్ల రుణాల గ్రహీతలు త్వరలో ఫ్లోటింగ్ వడ్డీరేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ వడ్డీరేట్ల విధానంలోకి మారేందుకు అవకాశం రానున్నది. ఇందుకు ఒక ఫ్రేమ్ వర్క్ రూపొందిస్తామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. మూడు రోజులుగా జరిగిన ద్వైమాస ఎంపీసీ సమావేశాల నిర్ణయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కేవలం ఇండ్ల రుణాలకు మాత్రమే కాక ఆటోమొబైల్, ఇతర రుణాలు తీసుకున్న వారు కూడా ఫ్లోటింగ్ వడ్డీరేట్లతో అమల్లో ఉన్న అధిక వడ్డీ రేట్ల నుంచి రిలీఫ్ పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఈబీఎల్ఆర్) విధానం కింద ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లను సవరించే విధానం మరింత పారదర్శకం కానున్నది. ఈబీఎల్ఆర్ కింద రుణ గ్రహీతలు కోరుకున్నప్పుడు ఫ్లోటింగ్ వడ్డీ రేటు నుంచి ఫిక్స్డ్ వడ్డీరేటుకు మారిపోవచ్చు. ఇందుకు విధి విధానాలను రూపొందించాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఇప్పటి వరకు బ్యాంకులు వడ్డీరేట్లకు అనుగుణంగా నేరుగా టెన్యూర్ పెంచేయడం చేస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి.
దీని ప్రకారం వడ్డీరేట్లు పెరిగినప్పుడు ఈఎంఐ లేదా టెన్యూర్ పెంపు విషయమై సంబంధిత రుణ గ్రహీతలకు సమాచారం ఇవ్వాలని ఆర్బీఐ తెలిపింది. ఫిక్స్డ్ వడ్డీరేట్లకు మారేందుకు అవకాశం కల్పించడంతోపాటు ఆయా ఆప్షన్ వినియోగించుకునే వారిపై మోపే చార్జీల భారం తదితర వివరాలపై రుణ గ్రహీతలకు అవగాహన కల్పించాలని సూచించింది. ఈ చర్యల వల్ల కస్టమర్లకు రక్షణ బలోపేతం అవుతుంది.
ఆర్బీఐ రెపోరేట్కు అనుగుణంగా ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఈఎంఐ చెల్లింపులు యథాతథంగా కొనసాగిస్తూ టెన్యూర్ సవరిస్తాయి. ఈ విషయమై రుణ గ్రహీతలకు బ్యాంకులు సమాచారం ఇవ్వడం లేదని తాము నిర్వహించిన సర్వేలో ప్రజలు తెలిపారని ఆర్బీఐ పేర్కొంది. ఫ్లోటింగ్ వడ్డీరేట్లను అమలు చేసే విషయంలో తమ సమ్మతి లేకుండానే బ్యాంకులు నిర్ణయాలు తీసుకుంటున్నాయని ఆయా రుణ గ్రహీతలు తమ ద్రుష్టికి తెచ్చారని ఆర్బీఐ వివరించింది. ఈ సమస్యకు పరిష్కారంగా.. ఫ్లోటింగ్ వడ్డీరేట్ల నుంచి ఫిక్స్ డ్ వడ్డీరేట్లకు మారేందుకు ఒక ఫ్రేమ్ వర్క్ తీసుకు వస్తామని శక్తికాంత దాస్ చెప్పారు.