న్యూఢిల్లీ, ఏప్రిల్ 10: ప్రస్తుత క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) బాసటగా నిలుస్తున్నా రు. భారత్లోని వారి కుటుంబాలకు, బంధువులకు ఎన్నారైలు పంపుతున్న డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరగడంతో రిజర్వ్బ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు పుంజుకుంటున్నాయి. తద్వారా దేశ స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎన్నారైలు పరోక్షంగా కారణమవుతున్నారు. అలాగే వారు భారత్లో వినియోగానికి, పెట్టుబడులకు ఊతమిస్తున్నారు. దేశంలోకి వచ్చిన రెమిటెన్సులు 2022 క్యాలండర్ సంవత్సరంలో 107.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచ బ్యాంక్ అంచనాలకంటే ఇవి 7.5 బిలియన్ డాలర్లు అధికం. ఫలితంగా 2021లో విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్ల మార్క్ను దాటాయి. రూపాయి పతనాన్ని నిలువరించడానికి ఆర్బీఐ కొంత మేర డాలర్లను ఖర్చుచేయడం, ఇటీవల ఎగుమతులు క్షీణించడంతో కొద్ది నెలల క్రితం 524 బిలియన్ డాలర్ల వద్దకు నిల్వలు తగ్గినప్పటికీ, తిరిగి 600 బిలియన్ డాలర్ల స్థాయికి చేరినట్టు రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇటీవల వెల్లడించారు.
జీడీపీలో 3 శాతం
ఎన్నారైలు దేశంలో కుమ్మరిస్తున్న డబ్బు భారత జీడీపీలో దాదాపు 3 శాతం. 2021లో 89.4 బిలియన్ డాలర్లు ఉన్న రెమిటెన్సులు 2022లో 100 బిలియన్ డాలర్ల మార్క్ను అధిగమించి 107.5 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) పెరగడం, ఎగుమతులు తగ్గడం, క్రూడ్ ధరలతో దిగుమతుల వ్యయం అధికం కావడం తదితర ప్రతికూలాంశాలను ఎదుర్కొనేందుకు రెమిటెన్సులు ఉపకరిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా వాణిజ్యలోటు పెరిగినప్పుడు, దానిని పూడ్చటానికి ఎన్నారైల డాలర్లు ఆయుధంలా అక్కరకు వస్తున్నాయి. అలాగే కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చి, పోయే విదేశీ ద్రవ్యం మధ్య వ్యత్యాసం) సైతం 3.7 శాతం నుంచి 2.4 శాతానికి తగ్గింది.
అత్యధికంగా అమెరికా నుంచి..
తక్కువ వేతనాలు కలిగిన గల్ఫ్ ప్రాంతం నుంచి ఎక్కువ రెమిటెన్సులు భారత్ వస్తుండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అధిక వేతనాలిచ్చే అమెరికా నుంచి ఎన్నారైలు పంపుతున్న డబ్బు పెరిగింది. గతంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రెమిటెన్సులకు పెద్ద వనరుగా ఉండగా, 2020-21లో ఆ స్థానాన్ని అమెరికా ఆక్రమించింది. 2020-21లో భారత్ అందుకున్న మొత్తం రెమిటెన్సుల్లో 23 శాతం యూఎస్ నుంచేనని ప్రపంచ బ్యాంక్ నివేదిక ఒకటి తెలిపింది. కొద్ది కాలం నుంచి అధిక నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల్ని యూఎస్, యూకే, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పొందుతూ అధికంగా ఆర్జిస్తున్నారని విశ్లేషకులు వివరిస్తున్నారు.