ప్రాజెక్టులోకి తరలివస్తున్న గోదారమ్మ
రామప్ప చెరువు నుంచిఎత్తిపోతల ద్వారా నీటి రాక
ఇక్కడి నుంచి మాదన్నపేట, శనిగరం వైపు తరలింపు
పాకాలవాగులో 15కిలోమీటర్ల పొడవునా పరవళ్లు
సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది చిత్రపటాలకు పాలాభిషేకం
వరంగల్రూరల్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): నర్సంపేట రైతుల జలకల సాకారమవుతున్నది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గోదావరి జలాలు ఈ ప్రాంతంలోని చెరువులను ముద్దాడుతున్నాయి. రామ ప్ప-రంగాయచెరువు ప్రాజెక్టులో ఎత్తిపోత ప్రారంభమై, రంగాయచెరువుకు అక్కడి నుంచి ఇతర చెరువులకు గోదారమ్మ పరుగులు పెడుతున్నది. సోమవారం చారిత్రక మాదన్నపేట చెరువులోకి చేరి, యాసంగికి భరోసా నింపడంతో రైతులు మురిసిపోతున్నారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చిత్రపటాలకు చెరువుల వద్ద పాలాభిషేకం చేస్తున్నారు. జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మూడోదశలో భాగంగా నర్సంపేట నియోజకవర్గానికి గోదావరి నీరిచ్చేందుకు ప్రభుత్వం రామప్ప- రంగాయచెరువు (ప్యాకేజీ-5) ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి చొరవతో ఈ ప్రాజె క్టు నిర్మాణ పనులు చకచకా జరిగాయి. ప్రస్తుత యా సంగి సీజన్లో రైతులకు ఉపయోగపడేలా రామప్ప చెరువు నుంచి ఎత్తిపోతతో రంగాయచెరువులోకి గోదావరి నీరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. తొలుత గతేడాది యాసంగిలో ట్రయల్న్ చేసిన మోటరును ఇటీవల ఆన్ చేసి, నల్లబెల్లి మండలంలోని మేడివాగు వద్ద అమర్చిన వాల్వ్(ఓటీ) ద్వారా గోదావరి జలాలను రంగాయచెరువులోకి తరలిస్తున్నారు.
సుమారు నెల రోజులు ఈ మోటరు పనిచేసింది. కొద్దిరోజుల క్రితం ఇంజినీర్లు రెండో మోటరు ట్రయల్న్ నిర్వహించారు. ఇది కూడా సక్సెస్ కావడంతో రామప్ప నుంచి రెండు మోటర్ల పంపింగ్ ద్వారా ఇప్పటికే రంగాయచెరువులోకి 180 ఎంసీఎఫ్టీల గోదావరి నీరు చేరింది.
రంగాయచెరువులోకి వస్తున్న గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువుకు తరలించాలని ఎమ్మెల్యే పెద్ది ఇంజినీర్లకు సూచించారు. ఈ మేరకు వారు రంగాయచెరువు, మాదన్నపేట చెరువు మధ్య 15 కి.మీ నిడివితో ఉన్న పాకాల వాగును పరిశీలించి, కొద్దిరోజుల క్రితం రంగాయచెరువు తూము ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ జల సవ్వడిని ఆదివారం ఇటుకాలపల్లి వంతెన వద్ద ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించా రు. నిండు వేసవిలో గోదావరి పరవళ్లు చూసి సంతో షం వ్యక్తం చేశారు. రంగాయచెరువు నుంచి విడుదలైన నీరు సోమవారం మాదన్నపేట చెరువుకు చేరాయి. పాకాల వాగు ద్వారా గోదావరి నీరు మాదన్నపేట చెరువులోకి నిరంతరం ప్రవహించనున్నాయి. ఎమ్మెల్యే పెద్ది సూచనతో ఇంజినీర్లు రంగాయచెరువు నుంచి గోదావరి జలాలను నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని దొప్పోని చెరువులోకి కూడా తరలిస్తున్నా రు. రంగాయచెరువు మెయిన్ కెనాల్ ద్వా రా 8 కి.మీ దూరంలో ఉన్న దొప్పోని చెరువులోకి కొద్దిరోజుల నుంచి గోదావరి నీరు చేరుతున్నది. పాకాలతోపాటు పలు చెరువులకు రంగాయచెరువు ప్రాజెక్టు ద్వారా గోదావరి నీరు తరలించే అవకాశం ఉంది.
ఢోకా లేదని రైతుల ధీమా
రంగాయచెరువు, మాదన్నపేట చెరువు లు రెండు కూడా జిల్లాలో ఎక్కువ ఆయకట్టు కలిగినవి కావడం విశేషం. జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం మాదన్నపేట చెరువు కింద 2,400ఎకరాలకు పైగా, రంగాయచెరువు కింద 1,600 పైగా, దొప్పోని చెరువు కింద 150 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్నది. రంగాయప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతతో గోదావరి నీరు వచ్చే అవకాశం ఉన్నందున అధికారులు రంగాయచెరువు కింద ప్రస్తుత యాసంగి మొత్తం 1,600 ఎకరాలు, మాదన్నపేట చెరువు కింద వెయ్యి ఎకరాల తైబందీ మాత్రమే ఖరారు చేశారు. ఈ రెండు చెరువుల కింద రైతులు తైబందీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేశారు. ప్రధానంగా మాదన్నపేట చెరువు కింది ఆయకట్టుదారుల్లో పంటలకు సరిపడా నీరు అందుతుందో లేదోననే ఆందోళన నెలకొంది. అయితే, ఎమ్మెల్యే పెద్ది చొరవతో మాదన్నపేట చెరువులోకి పుష్కలంగా గోదావరి జలాలు వస్తుండడంతో ఆయకట్టుదారుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఇక తమ పంటలకు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శనిగరంలోని దొప్పోని చెరువు కింద పంటలు సాగు చేసిన రైతులదీ ఇదే పరిస్థితి. రంగాయచెరువు ద్వారా తమ చెరువులోకి నీరు వస్తుండడంతో యాసంగి పంటలకు రందిలేదని సంబురపడుతున్నారు. అంతేకాదు.. పాకాలవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసిన రైతులు సైతం గోదావరి నీటిని తమ పంటలకు అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట
గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా కన్నుమూత