ముంబై, డిసెంబర్ 9: దేశంలోనే అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) నిలిచింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ విలువ 202 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు హురున్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. ఈ ఏడాదికిగాను ప్రపంచంలోని అత్యంత విలువైన 500 సంస్థలతో శుక్రవారం హురున్ ఓ జాబితాను విడుదల చేసింది. ఈ హురున్ గ్లోబల్ 500 రిపోర్టులో భారత్కు చెందిన 20 కంపెనీలున్నాయి. ఇందులో రిలయన్స్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నది. అంతర్జాతీయ స్థాయిలో 34వ స్థానంలో ఉన్నది. ఇక 139 బిలియన్ డాలర్లతో దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ దేశీయంగా రెండో స్థానంలో స్థిరపడింది.
హురున్ లిస్టులో ఈసారి భారత్ నుంచి చోటు పొందిన 20 సంస్థల్లో గౌతమ్ అదానీకి చెందినవే నాలుగున్నాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్లకు స్థానం లభించింది. వీటిలో 63 బిలియన్ డాలర్ల విలువతో అదానీ ఎంటర్ప్రైజెస్ ముందున్నది. ఈ ఏడాది అక్టోబర్ 26 నాటికి స్టాక్ మార్కెట్లలో ఉన్న విలువ, సంస్థాగత విలువల ప్రకారం ఈ ర్యాంకులను ఇచ్చారు.