న్యూఢిల్లీ, అక్టోబర్ 26: దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమేనని, కంపెనీ ప్రయోజనాలను విఘాతపర్చేదేనంటూ మొత్తం సిబ్బందికి ఓ సందేశమిచ్చింది. ‘పూర్తిస్థాయిలోగానీ లేదా పాక్షికంగానైనా మా ఉద్యోగులు ఎక్కడైనా రెండో ఉద్యోగమంటూ చేస్తే.. అది ఐబీఎం ప్రయోజనాలను దెబ్బతీసినట్టే’ అని సంస్థ దేశీయ, దక్షిణాసియా అధిపతి సందీప్ పటేల్ అన్నారు. మూన్లైటింగ్ తొలుత ఇన్ఫోసిస్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఇక ఈ అంశమై విప్రో ఏకంగా 300మంది ఉద్యోగులను తీసేసిన సంగతీ విదితమే. టీసీఎస్, హెచ్సీఎల్ సైతం మూన్లైటింగ్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే మెజారిటీ సంస్థలు మూన్లైటింగ్ను వ్యతిరేకిస్తున్నా.. కొన్ని సంస్థలు మాత్రం అదేమంత పెద్ద విషయం కాదంటూ తేలిగ్గా తీసుకుంటున్నాయి.
మూన్లైటింగ్ నేపథ్యంలో ఇన్ఫోసిస్ ‘యాక్సలరేట్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అసలు పని పూర్తయిన తర్వాత ఖాళీ సమయాలను సద్వినియోగం చేసుకోవాలనుకునే ఉద్యోగుల కోసమే ఈ సరికొత్త వేదిక. యాక్సలరేట్ ప్రాజెక్టులు అనేవి మేనేజర్లు ఇచ్చే చిన్నచిన్న టాస్క్లు. మానవ వనరుల (హెచ్ఆర్) బృందాలు సైతం ఈ వేదికపై ఉద్యోగుల్లో అవగాహనను కల్పిస్తున్నాయి. ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులైన ఉద్యోగులను ఒడిసి పట్టుకోవడం ఇప్పుడు ఐటీ కంపెనీలకు సవాల్గా మారినది తెలిసిందే. ఈ క్రమంలో మూన్లైటింగ్ ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటే సంస్థకే నష్టమని భావిస్తున్న ఇన్ఫోసిస్ ‘యాక్సలరేట్’కు శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఇతర ప్రత్యర్థి సంస్థల్లో దొంగచాటుగా పనిచేసే అవసరం ఉద్యోగులకు ఉండదని, సొంత సంస్థలోనే అదనపు పనిచేస్తూ మరింత ఆదాయం పొందవచ్చని చెప్తున్నారు. కాగా, రెగ్యులర్గా ఒక సంస్థలో పనిచేస్తూనే.. మరో సంస్థలో అదనపు ఉద్యోగం చేయడాన్ని మూన్లైటింగ్గా ఐటీ సంస్థలు పేర్కొంటున్నాయి.