RBI rule on ATM | ఏటీఎంల ఏర్పాటు, వాటి నిర్వహణ విధానంలో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయి. కొత్తగా ఏటీఎంల ఏర్పాటు ప్రక్రియ నెమ్మదిగా సాగొచ్చు.. మారుమూల ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాలను బ్యాంకులు మూసివేయొచ్చు. దీనికి ఏటీఎంల నిర్వహణపై ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనే కారణంగా తెలుస్తున్నది. ప్రతి నెలలో పది గంటలకు పైగా ఏటీఎం ఖాళీగా ఉంటే సంబంధిత బ్యాంకుపై రూ.10 వేల జరిమాన విధిస్తామని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నిబంధన బ్యాంకులకు క్లిష్ట సమస్యలు తెచ్చి పెడుతున్నది. ఏటీఎంల నిర్వహణ విషయమై అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని బ్యాంకర్లు చెబుతున్నారు.
ప్రతి బ్యాంకు ఏటీఎంల్లో 10 శాతానికి పైగా ఖాళీగా ఉంటాయని ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారి అన్నారు. దీనికి పలు కారణాలు ఉన్నాయన్నారు. మారుమూల ప్రాంతాల్లో కరెంట్ లేకపోవడం, రాత్రివేళ మూసి ఉంచడం.. కొన్ని సందర్భాల్లో జనరేటర్ సమస్యలు తలెత్తడం వంటి అంశాలు ఉన్నాయన్నారు.
చాలా ఏటీఎంలు రాత్రి వేళ మూసి ఉంటాయని, దీని ప్రభావం బ్యాంకులపై భారీగా ఉంటుందని అధికారులు అంటున్నారు. మారుమూల ప్రాంతాల్లో రాత్రివేళ ఏటీఎంలు నడుపలేం అని చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డ్ ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ వినియోగం అదనపు భారంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు.
భద్రత కోసం సెక్యూరిటీ గార్డు నియామకానికి నెలకు రూ.15-20 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత జూన్ నాటికి దేశంలో 2.39 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. వాటిల్లో 53 శాతం మెట్రో, అర్బన్ ప్రాంతాలు.. 47 శాతం సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దీని ప్రకారం ఈ ఏటీఎం కేంద్రాల వద్ద సెక్యూరిటీ గార్డు నిర్వహణలకు నెలకు దాదాపు రూ.50 కోట్లు బ్యాంకులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఏటీఎంల్లో నిరంతరం క్యాష్ ఉంచాలన్న నిబంధన అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమలులోకి రానున్దని.
ఆర్బీఐ నిబంధన అమలు చేయాలంటే థర్డ్ పార్టీ కంపెనీలు ఏటీఎంల నిర్వహణకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏటీఎంల్లో క్యాష్ నింపడం రొటేషన్ పద్దతిపై సాగుతున్నది. కానీ ఇక ప్రతిరోజూ ఏటీఎంలో మనీ నింపాలంటే సవాల్గా మారుతుంది. ఆర్బీఐ నిబంధన నేపథ్యంలో క్యాష్ వెహికల్స్ నడుపడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
ఏటీఎంల్లో నిత్యం నగదు ఉంచాలన్న ఆర్బీఐ నిబంధనతో కొన్ని ప్రాంతాల్లో ప్రజా జీవితం సౌకర్యవంతంగా ఉంటుందని ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ సీఈవో సునీల్ మెహతా చెప్పారు. కానీ బ్యాంకులు తమ ఏటీఎంలను తగ్గించుకునే పనిలో పడతాయన్నారు. ఏటీఎంల నిర్వహణ ఎలా చేయాలన్నది బ్యాంకులు నిర్ణయించుకుంటాయన్నారు. తత్ఫలితంగా గ్రామాల్లోని ఏటీఎంలపై ప్రతికూల ప్రభావం పడుతుందని సునీల్ మెహతా చెప్పారు. అంటే మారుమూల గ్రామాల్లో ఏటీఎంలను ఎత్తేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఎస్బీఐకి గరిష్ఠంగా 64 వేలఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. ఐసీఐసీఐ 16,800.. యాక్సిస్ బ్యాంక్ 16,800, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 15 వేలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13,700, కెనరా బ్యాంక్ 13,100.. యూనియన్ బ్యాంక్ 11 వేలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 11,600, బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,400 ఏటీఎంలను నిర్వహిస్తున్నాయి.
2018లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం సాయంత్రం ఆరు గంటల తర్వాత ఏటీఎంల్లో నగదు నింపొద్దు. పట్టణ ప్రాంతాల్లో రాత్రి 9 గంటల తర్వాత.. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఏటీఎంల్లో నగదు నింపొద్దని కేంద్ర హోంశాఖ నోటిషికేషన్ జారీ చేసింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే ఏటీఎంల్లో నగదు నింపుతారు. దీని ప్రకారం ప్రతి ఏటీఎం నెలలో 10 గంటలు ఖాళీగానే ఉంటుంది.
రాత్రి ఏడు గంటలకు ఏటీఎం ఖాళీ అయితే, ఉదయం తొమ్మిది గంటల వరకు వేచి చూడాల్సిందే. ఇదొక్కటే కాదు.. రూ.2000 విలువైన నోటు ఏటీఎంల్లో కనిపించడం లేదు. రూ.2000 నోట్లయితే తక్కువ వచ్చేవి. ఇప్పుడు రూ.500 విలువైన నోట్లు విత్ డ్రా చేస్తే ఎక్కువ సంఖ్యలో తీసుకెళ్లాల్సి వస్తున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!