Rs 2000 | క్లీన్ నోట్ పాలసీలో భాగంగా మార్కెట్లో చలామణిలో ఉన్న రూ.2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించింది ఆర్బీఐ. గత మే 19న వీటిని ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. అంతే కాదు.. సెప్టెంబర్ 30 లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ లేదా.. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నెలాఖరుతో రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ గడువు ముగుస్తున్నది. ఇంకా ఏడు శాతం నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని తెలిపింది ఆర్బీఐ.
ఆగస్టు 31 వరకు 93 శాతం రూ.2000 కరెన్సీ నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయని ఆర్బీఐ తెలిపింది. అంటే రూ.3.32 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లు బ్యాంకులకు తిరిగొచ్చాయని శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘2023 ఆగస్టు 31 నాటికి కేవలం 0.24 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లు మాత్రమే మార్కెట్లో చలామణిలో ఉన్నాయి. 2023 మే 19 నుంచి ఇప్పటి వరకు 93 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయి’ అని తెలిపింది ఆర్బీఐ. వాటిల్లో 87 శాతం రూ.2000 నోట్లు డిపాజిట్ల రూపంలో, మిగతా 13 శాతం ఇతర డినామినేషన్ నోట్లతో మార్పిడి ద్వారా బ్యాంకులకు తిరిగి వచ్చాయని వివరించింది.
2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్ల విలువైన రూ.2000 కరెన్సీ నోట్లు మార్కెట్లో చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. కానీ, 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల విలువ రూ.3.56 లక్షల కోట్లకు పడిపోయింది.
ఈ నెలాఖరుతో రూ.2000 నోట్ల మార్పిడి లేదా డిపాజిట్లకు గడువు ముగియనున్నది. ఈ గడువు లోపు ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ ద్వారా మార్చుకోవాలని ఆర్బీఐ సూచించింది. రూ.2000 విలువైన కరెన్సీ నోట్లు మార్కెట్లో పెద్దగా చలామణిలో లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత మే 24న తెలిపారు. కనుక ఆ నోట్ల ఉపసంహరణకు ఇబ్బందులు తలెత్తకపోవచ్చునని కూడా చెప్పారు.