Repo Rate | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను (key lending rate) తగ్గించింది. దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా రెపో రేటు (Repo Rate)ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ (RBI Governor) సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) శుక్రవారం వెల్లడించారు.
ఇటీవలి బడ్జెట్ నేపథ్యంలో ఈ ద్రవ్యసమీక్షపై అటు వ్యాపార-పారిశ్రామిక రంగాలు, ఇటు బ్యాంకర్లు-రుణగ్రహీతలు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. దీనికి తగ్గట్టుగానే రెపో రేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) కోత పెట్టింది ఆర్బీఐ. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకూ 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది. అలాగే రెండేళ్ల తర్వాత వడ్డీ రేట్లను సవరించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
గత రెండేండ్లుగా వడ్డీరేట్ల జోలికి వెళ్లకుండానే ఆర్బీఐ ద్రవ్యసమీక్షలు ముగుస్తున్నాయి. 2023 ఫిబ్రవరిలో చివరిసారిగా రెపో రేటును 6.50 శాతానికి పెంచారు. అప్పట్నుంచి ఇది అక్కడే ఉంటున్నది. ఇక రెపో రేటును ఆఖరిసారిగా తగ్గించింది 2020 మే నెలలోనే. కరోనా దెబ్బకు దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో నూతనోత్సాహాన్ని నింపేందుకు నాటి గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రత్యేకంగా ఆర్బీఐ సమీక్ష నిర్వహించి రెపో రేటును తగ్గించారు. రుణ లభ్యత పెరిగేలా 4 శాతానికి దించారు. కానీ ద్రవ్యోల్బణం విజృంభించడంతో తదుపరి ద్రవ్యసమీక్షల్లో దాన్ని అదుపు చేసేందుకు మళ్లీ వడ్డీరేట్లను వరుసగా పెంచుతూపోయారు. ఈ క్రమంలో ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వడ్డీరేట్లను ఆర్బీఐ తగ్గించడం విశేషం. ఈ తగ్గింపుతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది.
Also Read..
TGGENCO | చేతులెత్తేసిన జెన్కో.. ప్రైవేట్కు బ్యాటరీ స్టోరేజీ ప్లాంట్