Interest Rates hike | పెరిగిపోతున్న ధరల ప్రభావాన్ని తగ్గించేందుకు వడ్డీరేట్ల పెంపుపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోనున్నది. ఈ నెల నాలుగో తేదీన జరిగిన అత్యవసర ద్రవ్య పరపతి సమీక్షలో 40 బేసిక్ పాయింట్లు రెపోరేట్ను ఆర్బీఐ పెంచేసిన సంగతి తెలిసిందే. వచ్చేనెలలో జరిగే ద్వైమాస ద్రవ్య పరపతి సమీక్షలో మరోదఫా రెపోరేట్ పెంచే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ వర్గాల కథనం.
రెండేండ్ల క్రితం రెపోరేట్ను అత్యంత కనిష్ఠ స్థాయి నాలుగు శాతానికి తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న నంగతి తెలిసిందే. ఈ నెల ప్రారంభంలో 40 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో రెపోరేట్ 4.40 శాతానికి పెరిగింది.
ఏప్రిల్ ద్రవ్యోల్బణం 5.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఫిబ్రవరి అంచనాల కంటే 120 బేసిక్ పాయింట్లు ఎక్కువ. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధిరేటును 7.8 నుంచి 7.2 శాతానికి కుదించేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్ జీడీపీ 6.1 శాతం అని ప్రకటించింది. వచ్చేనెల 6-8 తేదీల మధ్య ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష జరుగనున్నది.