అన్ని ఏటీఎంలలో కార్డు రహిత నగదు ఉపసంహరణలు
బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఆర్బీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ, మే 19: ఏటీఎంలలో వినియోగదారులకు కార్డు రహిత నగదు ఉపసంహరణల సదుపాయాన్ని కల్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిర్ణయించింది. ఈ మేరకు అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లకు గురువారం ఆదేశాలిచ్చింది. ఇందుకోసం బ్యాంకులు, ఏటీఎం నెట్వర్క్లతో కలిసి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఇంటెగ్రేషన్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చెల్లింపుల వ్యవస్థ నేషనల్ పేమేంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)కూ సూచించింది. కార్డ్-లెస్ క్యాష్ విత్డ్రాయల్ (ఐసీసీడబ్ల్యూ-ఇంటరాపరబుల్ కార్డ్-లెస్ క్యాష్ విత్డ్రాయల్) సమయంలో కస్టమర్ ఈ యూపీఐని వినియోగిస్తారు. ఆపై నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ (ఎన్ఎఫ్ఎస్)/ఏటీఎం నెట్వర్క్స్ ద్వారా లావాదేవీల ప్రక్రియ పూర్తవుతుందని ఆర్బీఐ ఈ సందర్భంగా పేర్కొన్నది.
ఎటువంటి చార్జీల్లేవ్
ఈ కార్డ్-లెస్ క్యాష్ లావాదేవీలపై సూచించినవి కాకుండా ఏ చార్జీలుండవని ఆర్బీఐ స్పష్టం చేసింది. అలాగే ఈ ఐసీసీడబ్ల్యూ లావాదేవీల కోసం విత్డ్రాయల్ పరిమితులు.. సాధారణ ఏటీఎం విత్డ్రాయల్స్కు ఉన్నవేనని తెలియజేసింది. విఫలమైన లావాదేవీల కోసం హార్మనైజేషన్ ఆఫ్ టర్న్ అరౌండ్ టైం (టీఏటీ), కస్టమర్కు నష్టపరిహారానికి సంబంధించి ఇతర అన్ని సూచనలూ ఎప్పట్లాగే ఉంటాయన్నది.
కార్డు రహిత నగదు ఉపసంహరణ అంటే?
ఏటీఎంల నుంచి డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేకుండానే నగదును తీసుకునే సౌలభ్యమే ఈ కార్డు రహిత నగదు ఉపసంహరణ. నిజానికి కరోనా నేపథ్యంలో ఏటీఎంలకు వెళ్లడానికి ఇష్టపడని వారికోసం ఆయా బ్యాంకులు ఇప్పటికే తమ ఏటీఎంలలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్, బీవోబీ తదితర బ్యాంకులు ఈ తరహా సేవల్ని కల్పిస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకులు, ఏటీఎం ఆపరేటర్లకు ఈ సదుపాయాన్ని ఇప్పుడు ఆర్బీఐ తప్పనిసరి చేసింది. దీంతో స్కిమ్మింగ్, కార్డ్ క్లోనింగ్, డివైజ్ టాంపరింగ్ వంటి ఏటీఎం మోసాలకూ చెక్ పడుతుందని ఆర్బీఐ భావిస్తున్నది. కస్టమర్లు తమ మొబైల్ ఫోన్లలో వచ్చే పిన్ ద్వారా నగదును ఉపసంహరించుకునే అవకాశముండటమే ఇందుకు కారణం. కాగా, ప్రస్తుతం చాలా బ్యాంకులు ఈ సదుపాయాన్ని కస్టమర్లకు అందివ్వడం లేదు. పైగా రోజువారీ లావాదేవీ పరిమితులున్న విషయం తెలిసిందే. బ్యాంకునుబట్టి రూ.10,000-20,000లుగా ఇవి ఉన్నాయి. ఇక కొన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి అదనపు లావాదేవీలకు చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. ఆర్బీఐ తాజా ఆదేశాలతో ఇవన్నీ మారిపోనున్నాయి. ఖాతాదారులు ఆయా బ్యాంకుల మొబైల్ యాప్ ద్వారా ఈ సౌకర్యం కోసం విజ్ఞప్తి చేసుకోవచ్చు.