న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా వరుసగా కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ పెంచుతూపోతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో ఈ వడ్డింపులకు కొంత విరామం ఇద్దామనుకున్నా.. దానికి వ్యతిరేకంగా శక్తికాంత దాస్ ఓటేశారు. దీంతో రెపోరేటు మరో 35 బేసిస్ పాయింట్లు పెరగక తప్పలేదు. ఈ నెల 5-7 తేదీల్లో జరిగిన రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశం వివరాలు బుధవారం విడుదలయ్యాయి.
కఠిన ద్రవ్య విధాన చర్యలో అకాల విరామం ఓ విలువైన పొరబాటుకు కారణమవుతుందని ఈ సందర్భంగా దాస్ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే రేట్లను పెంచాలంటున్న ఎంపీసీలోని నలుగురు సభ్యులకే మద్దతు పలికారు. ఇక అంతకుముందు నాలుగు ద్రవ్యసమీక్షల్లో రెపోరేటు 190 బేసిస్ పాయింట్లు పెరిగిన సంగతి విదితమే.