న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ద్రవ్య విధానాన్ని ముందస్తుగానే సరళతరం చేస్తే ఇప్పటి వరకూ ద్రవ్యోల్బణంపై సాధించిన విజయం వృధా అయిపోతుందని రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి రెండోవారంనాటి మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశపు మినిట్స్ను గురువారం ఆర్బీఐ విడుదల చేసింది. ప్రస్తుత తరుణంలో అత్యంత జాగురూకతతో ద్రవ్య విధానం ఉండాలని ‘ద్రవ్యోల్బణంపై మన పోరు ఇంకా ఆగలేదని’ దాస్ పేర్కొన్నట్టు మినిట్స్ వెల్లడించింది. ద్రవ్యోల్బణాన్ని దించే చివరి ప్రయాణం క్లిష్టమైనదని, దీనిని విజయవంతంగా అధిగమించేందుకు ఎంపీసీ కట్టుబడి ఉండాల్సిందేనని గవర్నర్ వ్యాఖ్యానించారు. వడ్డీ రేట్లు తగ్గుతాయన్న అంచనాలతో కేంద్ర బ్యాంక్లకంటే మార్కెట్లు ముందే పరిగెడుతున్నాయని, కానీ ఎటువంటి ముందస్తు చర్య అయినా ఇప్పటివరకూ సాధించిన విజయాల్ని నిర్వీర్యం చేస్తుందని శక్తికాంత్ దాస్ ఆ సమావేశంలో ఎంపీసీ సభ్యులను హెచ్చరించినట్టు మినిట్స్ వివరించింది.
ఆరుగురు ఎంపీసీ సభ్యుల్లో ఐదుగురు రెపో రేటును 6.5 శాతం వద్దే కొనసాగించాలని ఓటు చేయగా, మరో సభ్యుడు జయంత్ ఆర్ వర్మ మాత్రం రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని, కఠిన ద్రవ్య విధాన వైఖరిని ‘న్యూట్రల్’కు మార్చాలంటూ ఓటు చేశారు. ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధి పెంపు.. రెండింటిపై దృష్టిపెడుతున్న సంకేతాల్ని ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు.