RBI | న్యూఢిల్లీ, మార్చి 20: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ భేటీ అయ్యారు. వచ్చే నెల తొలివారంలో తన పరపతి సమీక్షను ప్రకటించనున్న నేపథ్యంలో వీరిద్దరు భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను తన తొలి పరపతి సమీక్షను ఏప్రిల్ 3-5 వరకు నిర్వహించబోతున్నది.
రిటైల్ ధరల సూచీ నాలుగు శాతం తగ్గడానికి ఆహార పదార్థాల ధరలు అడ్డంకిగా మారాయని ఆర్బీఐ విడుదల చేసిన బుల్టెన్లో వెల్లడించింది. గతేడాది డిసెంబర్ నుంచి తగ్గుతూ వచ్చిన రిటైల్ ధరల సూచీ ఫిబ్రవరి నెలలో 5.09 శాతంగా నమోదైంది. మరోవైపు, వచ్చే సమీక్షలోనూ ఆర్బీఐ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయిలోనే కదలాడుతుండటం, ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపాయి.