న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: రెండో విడత సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ ధరను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ప్రకటించింది. గ్రాముకు రూ.5,923గా నిర్ణయించింది. ఈ నెల 11 నుంచి సబ్స్క్రిప్షన్ మొదలు కానున్న విషయం తెలిసిందే. 15 వరకు అందుబాటులో ఉంటుంది. కాగా, 999 స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు సాధారణ సగటు ధర ఆధారంగా బాండ్ నామినల్ వాల్యూను నిర్ణయించినట్టు ఆర్బీఐ ఈ సందర్భంగా ఓ ప్రకటనలో తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఈ సిరీస్-2 ఎస్జీబీలు వస్తున్నాయి.
ఇక ఆన్లైన్లో దరఖాస్తు, డిజిటల్ విధానంలో చెల్లింపులు చేసే మదుపరులకు ధరపై రూ.50 రాయితీ లభిస్తుంది. గ్రాము రూ.5,873కే వస్తుందన్నమాట. బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) వంటి గుర్తింపున్న స్టాక్ ఎక్సేంజీలు.. ఈ ఎస్జీబీలను అమ్ముతాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. భౌతిక బంగారం కొనుగోళ్లకు దీన్నో ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. 2015 నవంబర్లో ఈ ఎస్జీబీ స్కీం పరిచయమైంది. భౌతిక బంగారానికి ఉన్న డిమాండ్ను తగ్గించడమే ఈ ఎస్జీబీల లక్ష్యం.