బోధన్, మే 4: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని అనేక గ్రామాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభంలోనే కొవిడ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా వెలుగుచూశాయి. నెల రోజుల క్రితం పెద్దఎత్తున కొవిడ్ పాజిటివ్ కేసులు పెరగడంతో బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలపై జిల్లా అధికార యాంత్రాంగం దృష్టి సారించింది. అప్రమత్తమైన ఉన్నతాధికారులు బోధన్లోని జిల్లా దవాఖానలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు వైద్య సేవలు అందించేందుకు సర్వం సన్నద్ధం చేశారు. నెల రోజులుగా ఈ వైద్యశాలలో పెద్ద సంఖ్యలో కొవిడ్ బాధితులు చేరుతున్నారు. వీరందరికీ సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందించడంలో వైద్యశాల సిబ్బంది నిమగ్నమయ్యారు. సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత కొవిడ్ రోగులకు వైద్యసేవలు అందించే క్రమంలో ఈ దవాఖానలోని పలువురు నర్సులు, ఇతర వైద్యసిబ్బంది కరోనా బారినపడ్డారు.
సుమారు 35 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వీరంతా హోం ఐసొలేషన్ ఉండి, తిరిగి ఫ్రంట్లైన్ వారియర్స్గా వైద్యసేవలు అందించేందుకు విధుల్లో విడతలవారీగా చేరారు. ఒకపక్క కరోనా బారినపడుతున్నా.. ఫ్రంట్లైన్ వారియర్స్గా జిల్లా వైద్యశాల సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రశంసలను అందుకుంటున్నాయి. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్లో సైతం ఈ వైద్యశాల కొవిడ్ వైద్యసేవల్లో తనదైన ప్రత్యేకతను నిలుపుకొన్నది. అనేక మంది కొవిడ్ బాధితులు ఈ వైద్యశాలలో సేవలు అందుకొని కోలుకున్నారు. తిరిగి సెకండ్ వేవ్ ప్రారంభంకావడంతో కొవిడ్ వైద్యసేవల కోసం వైద్యశాలలోని వివిధ విభాగాల్లో కొవిడ్ వైద్యసేవలను పునరుద్ధరించారు. ఒకపక్క వైద్యశాల ఆధ్వర్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. మరోపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జోరుగా కొనసాగుతున్నది..
ఆక్సిజన్ బెడ్స్ 20 నుంచి 92కు పెంపు..
గత ఏడాది ఫస్ట్ వేవ్లో కొవిడ్ రోగులకు 20 ఆక్సిజన్ బెడ్లను జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుచేశారు. కొవిడ్ రోగులకు 60 పడకలను ఏర్పాటుచేశారు. గత ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అనేక మంది రోగులు ఈ ఐసొలేషన్ వార్డులో చికిత్సలు పొందారు. అప్పుడు ఇక్కడ వైద్య సిబ్బందికి పలువురి నుంచి ప్రశంసలు అందాయి. సరిగ్గా ఏడాది తర్వాత కరోనా విషయంలో అవే పరిస్థితులు పునరావృతమయ్యాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు బోధన్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కరోనా పాజిటివ్తో సీరియస్గా ఉన్న 318 మంది రోగులు చేరారు. వారిలో కేవలం 49 మందిని మాత్రమే ఇక్కడి నుంచి రిఫర్ చేశారు. చికిత్స పొందుతూ ముగ్గురు పేషెంట్లు మరణించారు. మొత్తం 45 మందికి ఆక్సిజన్ బెడ్స్పై చికిత్స అందించారు.
కేవలం ముగ్గురు తప్ప మిగతావారంతా ఈ ఐసొలేషన్ వార్డులో క్షేమంగా కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభిస్తుండడం, అనేక మంది కొవిడ్ పాజిటివ్ బాధితులు శ్వాసకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటుండడంతో ఈ జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ బెడ్లను పెంచాల్సిన అవసరాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కొవిడ్ పడకలను 60 నుంచి వంద పడకలకు పెంచారు. ఇందులో గతంలో ఉన్న ఆక్సిజన్ బెడ్లను 20 నుంచి ఒకేసారి 92కు పెంచారు. ఆక్సిజన్ బెడ్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చాయి. కాగా, వైద్యశాలకు నాలుగు వెంటిలేటర్లు వచ్చినప్పటికీ, సాంకేతిక సిబ్బంది కొరత, ఐసీయూ లేకపోవడంతో ప్రస్తుతం అవి వినియోగంలో లేవు. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ కృషిచేస్తున్నారు. త్వరలోనే వెంటిలేటర్ల సౌకర్యం ఏర్పడితే.. ప్రాణాపాయం ఉన్న కొవిడ్ బాధితులకు ఎంతో ఉపయోగం కలుగుతుంది.
యుద్ధప్రాతిపదికన కాంట్రాక్ట్ సిబ్బంది నియామకం..
కొవిడ్ వైద్య సేవల కోసం బోధన్ జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కాంట్రాక్ట్ పద్ధతిపై నర్సులు, ఇతర సిబ్బందిని నియమించారు. ఇందుకోసం ఇటీవల బోధన్ ఆర్డీవో ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. మూడు నెలల కాలానికి ముగ్గురు నర్సులను, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లను, ఒక డాటా ఎంట్రీ ఆపరేటర్ను, ఆరుగురు శానిటేషన్ వర్కర్లను నియమించారు. వీరంతా ప్రస్తుతం విధుల్లో చేరుతున్నారు. కాగా, కాంట్రాక్ట్ పద్ధతిపై కొవిడ్ వైద్య సేవల కోసం డాక్టర్లను నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కొవిడ్ బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు..
కరోనాతో సమస్యలు ఎదుర్కొంటున్నవారికి వైద్యసేవలు అందించేందుకు మరోసారి సన్నద్ధమయ్యాం. కొవిడ్ ఐసొలేషన్ వార్డులో ప్రస్తుతం అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సేవలందించే క్రమంలో మా వైద్యశాల సిబ్బంది సైతం కొవిడ్ పాజిటివ్బారిన పడుతున్నారు. అయినప్పటికీ, హోం ఐసొలేషన్లో కోలుకొని మళ్లీ వైద్యసేవలు అందిస్తున్నారు. వైద్యశాలలో ఆక్సిజన్ బెడ్లను 92కు పెంచడం జరిగింది. రెమ్డెసివిర్తోపాటు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యశాలలో రోగుల రద్దీ పెరుగుతుండడంతో.. కొవిడ్ పాజిటివ్ వ్యాప్తిలేకుండా చూసేందుకు కొవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్కు మార్చాం.