దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోష్ కనిపిస్తున్నది. ఒడిదొడుకులు చోటుచేసుకుంటున్నా స్థూలంగా మదుపరులు పెట్టుబడులకే ప్రాధాన్యతనిస్తున్నారు. అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 623.07 పాయిం ట్లు లేదా 0.76 శాతం ఎగబాకి 82,133.12 వద్ద నిలిచింది. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 90.50 పాయింట్లు లేదా 0.36 శాతం ఎగిసి 24,768.30 దగ్గర ముగిసింది. అయితే ఈ వారం ఈ లాభాలను మదుపరులు ఒడిసిపట్టుకోవచ్చన్న అంచనాలున్నాయి. కానీ నవంబర్లో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మార్కెట్ సెంటిమెంట్ను బలపరుస్తున్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు పెద్దపీట వేసే వీలు కూడా ఉందంటున్నారు. ఇక ఈ వారం డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు ప్రధానం. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,400 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,200 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,100-25,300 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.