దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభనష్టాల దోబూచులాటలు కొనసాగుతున్నాయి. గతకొద్ది రోజులుగా పడుతూలేస్తూ పయనిస్తున్న సూచీలు.. గడిచిన వారం కూడా అదేదారిలో నడిచాయి. మదుపరులు అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. అయినప్పటికీ ఆఖర్లో పెట్టుబడులకే పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 685.68 పాయింట్లు లేదా 0.86 శాతం బలపడి 79,802.79 వద్ద ఆగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 223.85 పాయింట్లు లేదా 0.93 శాతం పుంజుకొని 24,131.10 దగ్గర స్థిరపడింది.
ఈ వారం విషయానికొస్తే.. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, గౌతమ్ అదానీ లంచం కేసు, విదేశీ మదుపరుల పెట్టుబడులు ప్రధానంగా ట్రేడింగ్ను ప్రభావితం చేయవచ్చు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ గణాంకాలు నెమ్మదించడంపై మార్కెట్ రియాక్షన్ కీలకం కానున్నది. అంతేగాక నవంబర్ నెల వాహన విక్రయాలు ఆటో షేర్లపై ప్రభావం చూపవచ్చు. అలాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ కదలికలు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, ముడి చమురు ధరలు కూడా ముఖ్యమే.
అమెరికాలో పెరిగిన ద్రవ్యోల్బణం, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లపై ఊహాగానాలనూ తోసిపారేయలేమన్న అంచనాలున్నాయి. దీంతో ఒడిదొడుకులు ఈ వారం కూడా తప్పవనే అనిపిస్తున్నది. కాగా, అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,800 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,500-24,700 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.