న్యూఢిల్లీ, జూన్ 17: పెట్రో వాహనాల ధర స్థాయికే ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) ధరలు తగ్గుతాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఒక ఏడాది సమయంలోనే ఈవీల ధరలు దిగివస్తాయని అంచనా వేశారు. గురువారం ఒక సదస్సులో మాట్లాడుతూ పెట్రో వాహనాల తయారీ వ్యయానికి సమంగా ఈవీల వ్యయాన్ని తగ్గించేందుకు తాను ప్రయత్నిస్తున్నానని అన్నారు. బ్యాటరీల వ్యయం అధికంగా ఉన్నందునే ప్రస్తుతం ఈవీలు ఖరీదయ్యాయని, వాహన ధరలో 35 శాతం నుంచి 40 శాతం వరకూ బ్యాటరీ వ్యయమే ఉంటుందని తెలిపారు. ఇప్పుడు పెట్రో కార్లకంటే ఎంట్రీలెవల్ ఈవీ ధర రెండు రెట్లు ఉండగా, ద్విచక్ర వాహనాల విషయంలో 1.5 రెట్లు ఉంది.