న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సంస్కరణల పేరుతో కొద్దికాలం నుంచి వేగంగా ప్రవేశపెట్టిన విధానాలను ఒక్కొటొక్కటిగా వెనక్కు తీసుకుంటున్నట్లు కన్పిస్తున్నది. మూడు వ్యవసాయ చట్టాలను సంవత్సరంపాటు పట్టుకూర్చున్న కేంద్రం… తీవ్ర రైతు వ్యతిరేకతకు తలొగ్గి వాటిని ఉపసంహరించుకున్నరీతిలోనే తాజాగా రైల్వేల ప్రైవేటీకరణ చేసే ప్రణాళికే లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని తెగేసి చెప్పింది. భవిష్యత్తులో కూడా రైల్వేల్ని ప్రైవేటుకు అప్పగించబోమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ప్రకటించారు. ఇదే అంశాన్ని పార్లమెంటు ఉభయసభల్లో, ఇండియా చౌపాల్ సదస్సులోనూ మంత్రి ప్రస్తావించారు. డిసెంబర్ 1,2 తేదీల్లో వైష్ణవ్ ప్రకటనలు రాగా, డిసెంబర్ 2నే దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) నుంచి కీలక నిర్ణయం వెలువడింది. భారత్ గౌరవ్ రైళ్ల పేరుతో ప్రత్యేక రైళ్లను, వాటి నిర్వహణను ప్రైవేటుకు అప్పగించనున్నట్లు ఎస్సీఆర్ తెలిపింది. ఇదే సమయంలో రైల్వేల ప్రైవేటీకరణను కేంద్ర ప్రభుత్వం ఖండించినందున, గౌరవ్ రైళ్లు అందుబాటులోకి వస్తాయో, రావో అనే సందేహాలు మొదలయ్యాయి.
ఎన్ఎంపీ నుంచి రైల్వేల్ని తొలగిస్తారా…
రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్లు, ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రైవేటీకరిస్తారన్న వార్తలు రెండేండ్లుగా పదేపదే విన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో వివిధ ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన రూ.6 లక్షల కోట్ల నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో రైల్వే స్టేషన్లు, ప్యాసింజర్ రైళ్లు, రైల్వే స్టేడియంలు, కాలనీలు ఉన్నాయి. మరి రైల్వే మంత్రి తాజా ప్రకటన ప్రకారం ఎంఎన్పీ నుంచి వాటిని (రైల్వేల ఆస్తుల్ని) తొలగిస్తారా లేదా అన్నది స్పష్టంకాలేదు. కొన్ని రూట్లలో ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) ప్రాతిపాదికన ఆధునికమైన రైలు పెట్టెల్ని ప్రవేశపెడతామని మాత్రం వైష్ణవ్ రాజ్యసభకు తెలిపారు.
ప్రైవేటు ప్యాసింజర్కు తెరపడినట్లేనా…
భారతీయ రైల్వేల నెట్వర్క్లో ప్యాసింజర్ రైళ్లు నడిపేందుకు తొలిసారిగా ప్రైవే టు పెట్టుబడుల్ని గతేడాది జూలైలో కేంద్రం ఆహ్వానించింది. 109 రూట్లలో 151 అత్యాధునిక రైళ్ల నిర్వహణను ప్రైవేటుకు అప్పగించి, రూ.30,000 కోట్లు సమీకరించాలన్న ప్రణాళికతో బిడ్స్ను కూడా ఆహ్వానించింది. ఈ బిడ్స్కు స్పందన కరువయ్యిందని, రెండు సంస్థలే బిడ్ చేశాయని చెపుతూ ఆ బిడ్డింగ్ ప్రక్రియను పూర్తిగా రద్దుచేస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది. వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు రైతులు తీవ్ర పోరు జరిపినట్లే, రైల్వే కార్మిక యూనియన్లు సైతం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో కారణాన్ని చూపుతూ ప్యాసింజర్ రైళ్ల బిడ్స్ను రద్దు ప్రభుత్వం చేసింది. ఇదే క్రమంలో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదంటూ అశ్విని వైష్ణవ్ చెప్పారని పరిశ్రమ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
భారత్ గౌరవ్ రైళ్లు
దేశంలోని దర్శనీయ స్థలాల పర్యటన కోసం రైలు పెట్టెల్ని…ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు బాడిగకు ఇవ్వడమనేది ఎప్పట్నుంచో జరుగుతున్నదే. ఏకంగా ఇందుకు భారత్ గౌరవ్ రైళ్ల పేరుతో కాంట్రాక్టు పద్ధతిలో రైళ్లను, వాటి టిక్కెట్ ఛార్జీలు, క్యాటరింగ్ బాధ్యతల్ని ప్రైవేటుకు అప్పగించేందుకు దేశంలో తొలిసారిగా సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) ఆహ్వానం పలికింది. ఎస్సీఆర్ జోన్ జీఎం గజానన్ మాల్యా ఒక ప్రకటన చేస్తూ భారత దేశ సాంస్కృతిక, వారసత్వ, ప్రముఖ చారిత్రాత్మక ప్రదేశాలు, యాత్ర స్థలాలు విశేషాలను దేశ ప్రజలకు, ప్రపంచానికి తెలియచేయాలన్న లక్ష్యంతోనే ఈ రైళ్లను ప్రవేశ పెడుతున్నామన్నారు. భారత్ గౌరవ్ రైళ్ల నిర్వహణలో ప్రైవేటు సంస్థలకు ఇతివృత్త పర్యాటక, మార్గాల ఎంపిక, దర్శనీయ స్థలాలు, చార్జీల వంటి వాటిపై పూర్తి అధికారం ప్రైవేట్కే ఉంటుందని ప్రకటించడం గమనార్హం.
ఎస్సీఆర్ తెలిపిన వివరాలివి