పనిలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
మున్సిపాలిటీల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి : కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మధిర, మార్చి 31: చివరి ఆయకట్టు వరకూ సాగర్జలాలు అందిస్తామని కలెక్టర్ ఆర్.వీ.కర్ణన్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మెండెం లలిత అధ్యక్షతన ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. మే మొదటి వారం వరకు సాగర్ నీటిని అందిస్తామని తెలిపారు. అన్ని చెరువులను సాగర్ నీటితో నింపుతామని అన్నారు. అధికారులు ఫీల్డ్వర్క్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎర్రుపాలెం థర్డ్జోన్ పరిధిలోకి వస్తుందని, ఆ మండల రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ అధికారులతో మాట్లాడి పంట పొలాలకు సాగర్ నీటిని అందిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. జిల్లాలో రైతాంగానికి యాసంగి పంటకు నీటి ఎద్దడి లేకుండా అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. సాగర్జలాలు ఖమ్మం జిల్లాకు ఏప్రిల్, మే నెలల్లో ఎటువంటి కొరత లేకుండా రైతులకు అందజేస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మధిర మున్సిపాలిటీ కార్యాలయంలో జరుగుతున్న బడ్జెట్ సమావేశానికి హాజరై మున్సిపాలిటీలో మెరుగైన సౌకర్యాలకు కృషి చేయాలని సూచించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలో వెజ్, నాన్వెజ్ మార్కెట్ యార్డు, డంపింగ్ యార్డు , వైకుంఠ ధామాల ఏర్పాటు తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, కమిషనర్ అంబటి రమాదేవి, ఇరిగేషన్ శాఖ సీఈ శంకర్నాయక్, ఎస్ఈ ఆనంద్కుమార్, ఈఈ రామకృష్ణ, డీఈ నాగబ్రహ్మయ్య, తహసీల్దార్ డి.సైదులు, ఎంపీడీవో విజయభాస్కర్రెడ్డి, ప్రజాప్రతినిధులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.