న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం త్వరలో ఐపీవోకు వెళ్లనున్నది. పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం మనీ ద్వారా ఇన్షియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవో)కు వెళ్లనున్నట్లు సోమవారం తెలిపింది. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) రూట్లో ఐపీవోకు వెళ్లేందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అనుమతి ఇచ్చిందని పేటీఎం పేర్కొంది. కనుక ఇన్వెస్టర్లు వివిధ బ్రోకరేజీ వేదికల నుంచి @Paytm UPI handleపై పేటీఎంలో పెట్టుబడులు పెట్టొచ్చు.
కేవలం యూపీఐ హ్యాండిల్ ద్వారా మాత్రమే ఐపీవోకు వెళ్లేందుకు సెబీ నిబంధనలు అనుమతినిస్తున్నాయి. గతేడాది క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కూడా ఆన్ లైన్ చెల్లింపుల రంగంలో రిటైల్ ట్రేడర్లు యూపీఐ ద్వారా మాత్రమే ఐపీవోకు వెళ్లాలని నిర్దేశించాయి. @Paytm UPI handle ద్వారా తమ ఐపీవోకు వెళ్లేందుకు అనుమతించినందుకు లక్షల మంది ఇన్వెస్టర్లు నిరంతరాయంగా, సురక్షితంగా పెట్టుబడులు పెట్టేందుకు వెసులుబాటు లభించిందని పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సతీశ్ గుప్తా పేర్కొన్నారు.