న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: పేటీఎం కొత్త ఉద్యోగాలిస్తున్నది. సంస్థలో వివిధ స్థానాల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఉద్యోగుల్ని తీసుకుంటున్నది. నైపుణ్యం, ప్రతిభ కలిగినవారికి పెద్దపీట వేస్తామని పేటీఎం రిక్రూట్మెంట్ భాగస్వామి పేజ్గ్రూప్ తెలిపింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్)పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంక్షల నేపథ్యంలో ఇదిప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ప్రోడక్ట్, బిజినెస్ డివిజన్లలో ఉన్న వివిధ స్థాయిల్లో నియామకాలను చేపడుతున్నట్టు పేటీఎం వెబ్సైట్పై ప్రకటించారు. ‘పేటీఎం బిజినెస్ కోసం అత్యుత్తమ సామర్థ్యం, అత్యంత ప్రతిభ కలిగినవారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాం. ఈ నియామకాలు ఇలాగే కొనసాగవచ్చు. ముఖ్యంగా సంస్థలో ప్రోడక్ట్, వ్యాపార విభాగాల బలోపేతంపై దృష్టి పెట్టాం. అందుకే ఈ స్థాయిల్లో ఉన్న ఖాళీల భర్తీకి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాం’ అని పేజ్గ్రూప్ ఎండీ అంకిత్ అగర్వాల అన్నారు.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురవుతున్న పీపీబీఎల్ ఉద్యోగులు.. ఆ సంస్థను పెద్ద ఎత్తునే వీడుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇటు ఖాళీల భర్తీకి, అటు మిగతా ఉద్యోగుల్లో ఆత్వవిశ్వాసాన్ని నింపేందుకు ఈ రిక్రుట్మెంట్లు దోహదం చేస్తాయని పేటీఎం భావిస్తున్నది. పేటీఎంలో దాదాపు 30వేల ఉద్యోగులున్నట్టు అంచనా. కాగా, ఈ నెల 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లోని ఖాతాలు, ప్రీ-పెయిడ్ సాధనాలు, ఫాస్టాగ్స్, ఈ-వ్యాలెట్లలో కస్టమర్లు డిపాజిట్లు లేదా టాప్-అప్లను చేయరాదని, బ్యాంక్ కూడా వాటిని అంగీకరించరాదని జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపైనా బ్యాంక్పై ఆంక్షలుండగా, ఈ పరిమితులతో దాదాపుగా సంస్థ సేవలు నిలిచిపోయినట్టే అవుతున్నది. ఎన్నిసార్లు హెచ్చరించినా నిబంధనల అమలులో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నిర్లక్ష్య ధోరణినే అనుసరించిందని, అందుకే ఇలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆర్బీఐ చెప్తున్న సంగతీ విదితమే. యాప్ ద్వారా వ్యాలెట్, యూపీఐ సేవల్ని అందిస్తున్న పేటీఎం అనుబంధ సంస్థే ఈ పీపీబీఎల్.
విశ్వాసాన్ని కోల్పోబోమని.. కొత్తదనం, సమర్థతకు కట్టుబడి ఉన్నామని పేటీఎం ఈ సందర్భంగా స్పష్టం చేసింది. మా ఉద్యోగుల్లో నమ్మకం, ఉత్సాహం.. భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. చురుకుదనం, మార్గదర్శకత, వినూత్న స్ఫూర్తి వల్ల దేశంలోని ప్రతిభావంతులకు ఇప్పటికీ పేటీఎం అంటే మిక్కిలి ఆకర్షణీయమైన సంస్థేనని పేటీఎం రిక్రుట్మెంట్ అనుబంధ సంస్థ ఈఎంఏ పార్ట్నర్స్ ఇండియాకు చెందిన బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, టెక్నాలజీ విభాగాల సీనియర్ పార్ట్నర్ రీత్ భంబానీ అన్నారు.