Paytm : తమ బ్యాంకింగ్ విభాగం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో, ఎండీ సురీందర్ చావ్లా వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేశారని పేటీఎం మంగళవారం వెల్లడించింది. చావ్లా రాజీనామా జూన్ 26 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. చావ్లా వారసుడిగా తదుపరి సీఈవో బాధ్యతలు ఎవరు చేపడతారనే వివరాలను పేటీఎం వెల్లడించలేదు.
డిజిటల్ పేమెంట్ కంపెనీ బ్యాంకింగ్ యూనిట్పై ఆర్బీఐ ఉక్కుపాదం మోపడంతో బోర్డ్ ప్రక్షాళనలో భాగంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా విజయ్ శేఖర్ శర్మ వైదొలిగిన క్రమంలో చావ్లా నిష్క్రమణ చోటుచేసుకోవడం గమనార్హం. నిబంధనల అమల్లో సమస్యలు, పర్యవేక్షణ అంశాలు కొరవడటంతో మార్చి 15లోగా తన కార్యకలాపాలను మూసివేయాలని ఆర్బీఐ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ను కోరింది.
బ్యాంకింగ్ విభాగంతో తెగతెంపులు చేసుకునే క్రమంలో పేటీఎం, తన బ్యాంకింగ్ విభాగం పలు అంతర్గత కంపెనీ ఒప్పందాలకు స్వస్తిపలికేందుకు పరస్పరం అంగీకారానికి వచ్చాయి. కాగా, డిజిటల్ పేమెంట్స్ కంపెనీకి ఊరటగా భారత పేమెంట్స్ అథారిటీ పేటీఎంకు థర్డ్ పార్టీ యాప్ లైసెన్స్ మంజూరు చేసింది. బ్యాంకింగ్ విభాగం కార్యకలాపాలు ముగిసిన అనంతరం పేటీఎం తన పేమెంట్స్ ఆపరేషన్స్ చేపట్టేందుకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది.
Read More :
Marriage | 17 మంది మనుమలు, మనుమరాళ్లకు ఒకేసారి పెండ్లి..! ఒకే శుభలేఖ..!!