హైదరాబాద్, ఆగస్టు 24: వాహన పరిశ్రమకు పండుగ శోభ సంతరించుకోబోతున్నది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఈసారి శ్రావణ మాసంతో మొదలుకొని మార్గశిర్గ మాసం వరకు అంటే 70 రోజులపాటు జరిగే ఈ పండుగ సీజన్పై ఆటోమొబైల్ సంస్థలు గంపెడాశలు పెట్టుకున్నాయి. రెండేండ్లుగా పండుగ సీజన్లో నిరాశనే ఎదురైన ఆటోమొబైల్ సంస్థలు.. ఈసారి మాత్రం విక్రయాలు బాగుంటాయని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా 10 లక్షలకుపైగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవుతాయని ఫాడా అంచనా వేస్తున్నది. యుటిలిటీ, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇతర నెలలతో పోలిస్తే పండుగ సీజన్లో వాహన అమ్మకాలు అత్యధికంగా ఉంటాయి. మొత్తం వాహన విక్రయాల్లో పండుగ సీజన్ వాటా 22-26 శాతంగా ఉన్నది. ఈ ఏడాది మొత్తంగా 40 లక్షల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవనుండగా.. వీటిలో 10 లక్షల వాహనాలు ఈ పండుగ సీజన్లో అమ్ముడవనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు పలు ఆఫర్లను ప్రకటిస్తున్నాయి కూడా. ధర తగ్గింపుతోపాటు వారెంటీ, గ్యారెంటీ, బీమా, విడిభాగాల సరఫరా చార్జీల్లో రాయితీలు, డిస్కౌంట్లను అందిస్తున్నాయి.
వాహనాలపై వడ్డీరేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోళ్లు మాత్రం ఆగడం లేదు. టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. క్రమంగా నెల నెల విక్రయాలు రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయి. కరోనాతో రెండేండ్ల వరకు తక్కువ వడ్డీకే వాహన రుణాలు ఇచ్చిన బ్యాంకులు.. ఇటీవలికాలంలో భారీగా పెంచేశాయి. అయినప్పటికీ కుటుంబ అవసరాలు, రవాణా చార్జీల భారం నేపథ్యంలో వాహనాన్ని కొనుగోలు చేయడానికి మొగ్గుచూపుతున్నవారి సంఖ్య అధికంగానే ఉంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 16 లక్షలకు పైగా కార్లు అమ్ముడయ్యాయి.
ఇటీవలికాలంలో కార్ల ధరలకు రెక్కలొచ్చాయి. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నదంటూ అన్ని ఆటోమొబైల్ సంస్థలు తమ వాహన ధరలను భారీగా పెంచినప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఆయా కంపెనీలు, మాడల్స్నుబట్టి ఒక శాతం నుంచి ఐదు శాతం వరకు ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
ఒకవైపు కార్ల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటంతో కొనుగోలుదారులు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. తక్కువ ధరకే తమకు నచ్చిన కారును కొనుగోలు చేయాలనుకునేవారికి సెకండ్ హ్యాండ్ వాహన విక్రయ సంస్థలు అడ్డాగా మారుతున్నాయి. స్పిన్నీ, కార్స్24తోపాటు ప్రాంతీయ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఆయా సంస్థలు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడానికి రకరకాల ఆఫర్లు ఇస్తున్నాయి. కారు కొనుగోలుపై 90 శాతం వరకు రుణం కూడా లభిస్తుండటంతోపాటు ఏడాది బీమా, కారు రిజిస్ట్రేషన్కు సంబంధించి ఎలాంటి చార్జీని వసూలు చేయకపోవడం కూడా కస్టమర్లు వీటివైపు మొగ్గుచూపుతున్నారు. కారు నచ్చకపోతే వారం రోజుల్లో వాపస్ ఇచ్చే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
నూతన టెక్నాలజీతో విడుదలైన కార్లకు కొనుగోలుదారులు ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా భద్రత ఫీచర్లు, ఎల్ఈడీ, కెమెరా, వేగం, మైలేజీ, ఇతర టెక్నాలజీ ఉన్న కార్లకు మద్దతు లభిస్తున్నది. దీంతో ఆయా ఆటోమొబైల్ సంస్థలు వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగానే వాహనాలను రూపొందించి వారి మన్నలను పొందుతున్నాయి.
‘ఈ పండుగ సీజన్లో వాహన అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోనున్నాయి. వర్షాలు ఆశించిన స్థాయిలోనే కురుస్తుండటం, వాహనాలపై రుణాలు సులువుగా లభిస్తుండటం కూడా ఇందుకు కారణం.
– శ్రీవాత్సవ, మారుతి సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్
‘పండుగ అంటేనే ప్రజల్లో సెంటిమెంట్. ఈ సీజన్లో వాహనాలకు డిమాండ్ అధికంగా ఉంటుందని ఆశిస్తున్నా.
– శేలష్ చంద్ర, టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విభాగ ఎండీ