SBI Tax Saving FD | ప్రతియేటా మార్చి వచ్చిందంటే వేతన జీవులు పన్ను ఆదా మార్గాలపై దృష్టి పెడతారు. ఇందుకోసం పలు బ్యాంకులు ఐదేండ్ల గడువుతో కూడిన పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలను ఆఫర్ చేస్తుంటాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లను వేతన జీవి తన ఐటీ రిటర్న్స్లో డిడక్షన్ కోసం క్లయిమ్ చేసుకోవచ్చు. అటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ పథకమే ఎస్బీఐ ఆఫర్ చేస్తున్నది. ఎస్బీఐ టాక్స్ సేవింగ్టర్మ్ డిపాజిట్స్ పథకం పేరిట అమలు చేస్తున్న ఈ స్కీమ్లో ఎన్నారైలు కూడా చేరొచ్చు. ఆ ఎన్నారై హిందూ ఉమ్మడి కుటుంబ యజమాని అయి ఉండటంతోపాటు పాన్ కార్డు ఉంటే ఈ పథకం కింద మనీ మదుపు చేయొచ్చు.
ఎస్బీఐ టాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్స్ పథకం 2006లో ప్రారంభమైంది. కనీస గడువు ఐదేండ్లు. గరిష్ట పరిమితి పదేండ్లు. ఈ పథకం కింద కనీసం రూ.1000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తదుపరి అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయొచ్చు. ఏడాదికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ఈ స్కీంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీకి పన్ను రాయితీ ఉంటుంది. దీనిపై 5.5 శాతం సాధారణ ఇన్వెస్టర్లకు. 6.3 శాతం వడ్డీరేటు వృద్ధులకు ఆఫర్ చేస్తున్నది ఎస్బీఐ.
క్రెడెన్షియల్స్ వాడుతూ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ లాగిన్ కావాలి. అటుపై ఫిక్స్డ్ డిపాజిట్ టాబ్లో e-TDR/ eSTDR FDపై క్లిక్ చేయాలి. అటుపై ఆదాయం పన్ను పొదుపు పథకం కింద e-TDR/ eSTDR క్లిక్ చేయాలి. తర్వాత ప్రొసీడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అకౌంట్ను సెలెక్ట్ చేసి, మీరు డిపాజిట్ చేసే మొత్తాన్ని నమోదు చేయాలి. పథకం టర్మ్స్ అండ్ కండీషన్స్ను ఆమోదించాలి. అటుపై సబ్మిట్ బటన్ నొక్కాలి. తదుపరి మీ ఎస్బీఐ పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకం వివరాలు తెలుసుకోవచ్చు.
వ్యక్తులు ప్రతియేటా ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. ఒక ఏడాదిలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10 వేలు దాటితే సంబంధిత బ్యాంకులు టీడీఎస్ డిడక్ట్ చేస్తాయి. టీడీఎస్ మినహాయింపు పొందడానికి డిపాజిటర్ 15జీ/15హెచ్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎస్బీఐ టాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్స్ పథకంలో విత్డ్రాయల్, నామినేషన్ రూల్స్, లోన్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. ఐదేండ్ల టెన్యూర్ పూర్తయ్యే వరకు నగదు విత్డ్రాయల్ చేయొద్దు. ఒకవేళ డిపాజిటర్ మృతి చెందితే మాత్రం మినహాయింపు ఉంటుంది. డిపాజిటర్లకు నామినేషన్ ఫెసిలిటీ కల్పిస్తుందీ పథకం. ఐదేండ్ల లోపు రుణం తీసుకునే వెసులుబాటు ఉండదు.