ముంబై, జనవరి 9: దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ భారీగా ఉద్యోగులను నియమించు కోవడానికి సిద్ధమైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తాము 1,25,000-1,50,000 మేర కొత్త నియామకాలు జరుపుతామని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. వాస్తవానికి ఈ డిసెంబర్ త్రైమాసికంలో టీసీఎస్ ఉద్యోగుల సంఖ్యలో 2,197 మంది తగ్గారు. 2022 డిసెంబర్ చివరికల్లా కంపెనీ ఉద్యోగుల సంఖ్య 6,13,974కు దిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 6,16,171 మంది ఉద్యోగులున్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో 28,238 మందిని టీసీఎస్ కొత్తగా నియమించుకుంది. తమ సర్వీసులకు డిమాండ్ తగ్గడం ఇందుకు కారణం కాదని, గత 18 నెలల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరపడం వల్ల తాజా త్రైమాసికంలో సంఖ్య తగ్గిందని సీఈవో చెప్పారు. గత ఏడాది తాము అధిక నియామకాలు జరపడం కంపెనీకి ప్రయోజనం కలిగిందని, వచ్చే సంవత్సరం కూడా 1.25-1.50 లక్షల మధ్యలో కొత్త నియామకాలుంటాయన్నారు. 2022 మార్చితో ముగిసిన సంవత్సరంలో సంస్థ 1.03 లక్షల మందిని రిక్రూట్ చేసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నికరంగా 55,000 మందిని తీసుకున్నది. అందులో 43,000 మంది ఫ్రెషర్లు ఉన్నారు.
క్యూ3లో లాభం 10,846 కోట్లు..
అమెరికాలో ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న వార్తల నడుమ దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ 2022 డిసెంబర్ త్రైమాసికంలో లాభాల్ని వృద్ధిపర్చుకుంది. టీఎస్ఈ నికరలాభం 2021 డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే 11 శాతం, 2022 సెప్టెంబర్ త్రైమాసికంకంటే 4 శాతం వృద్ధిచెంది రూ. 10,846 కోట్లకు చేరింది. కానీ ఈ లాభం విశ్లేషకుల అంచనాల్ని చేరలేకపోయింది. రూ.11.200 కోట్ల లాభాన్ని, రూ. 56,890 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని పలు బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేశాయి. అయితే కంపెనీ ఆదాయం అంచనాలకంటే అధికంగా సెప్టెంబర్ క్వార్టర్కంటే 5.3 శాతం వృద్ధిచెంది రూ. 58,229 కోట్లకు పెరిగింది. సాధారణంగా డిసెంబర్ సీజన్ సాఫ్ట్వేర్ సంస్థలకు బలహీనమైన త్రైమాసికం అయినప్పటికీ, క్లౌడ్ సర్వీసుల నేతృత్వంలో మార్కెట్ వాటాను పెంచుకున్నామని, ఉత్తర అమెరికా, యూకేల్లో వ్యాపారాన్ని వృద్ధిపర్చుకున్నామని ఆయన చెప్పా రు. వార్షిక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేర్హోల్డర్లకు డివిడెండ్ల బొనంజాను ప్రకటించింది. షేరుకు రూ.67 చొప్పున ప్రత్యేక డివిడెండుతో పాటు షేరుకు రూ. 8 చొప్పున మధ్యంతర డివిడెండును సిఫార్సుచేసింది.
7.5 బిలియన్ డాలర్ల డీల్స్
తాజాగా ముగిసిన మూడు నెలల కాలంలో టీసీఎస్ 7.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లను సంపాదించింది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు త్రైమాసికాల్లో 8 బిలియన్ డాలర్ల చొప్పున ఆర్డర్లను సాధించింది. కంపెనీ వరుసగా రెండో త్రైమాసికంలో ఆపరేటింగ్ లాభాల మార్జిన్లను పెంచుకుంది.