న్యూఢిల్లీ, ఆగస్టు 28: అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల డిస్క్లోజర్లు, ఈ గ్రూప్లో విదేశీ ఫండ్స్ వాటాల పరిమితులకు సంబంధించి నిబంధనల ఉల్లంఘన జరిగిందని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దర్యాప్తులో వెల్లడైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అదానీ గ్రూప్పై యూఎస్ హెడ్జ్ఫండ్ హిండెన్బర్గ్ లేవనెత్తిన తీవ్ర ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో హిండెన్బర్గ్ నివేదిక వెల్లడైన అనంతరం ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదంటూ అదానీ గ్రూప్ అప్పట్లో చెప్పుకుంది. సెబీ కనుగొన్న ఉల్లంఘనలు ‘సాంకేతికమైనవని’, దర్యాప్తు పూర్తయిన తర్వాత వీటికి జరిమానాలు మాత్రమే విధిస్తారని సంబంధిత ఇరువురు వ్యక్తులు వెల్లడించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. అదానీ గ్రూప్పై సెబీ దర్యాప్తును పర్యవేక్షిస్తున్న సుప్రీం కోర్టు ఈ అంశంపై మంగళవారం విచారించనుంది. అయితే అదానీ దర్యాప్తుపై తాము ఉత్తర్వులు జారీచేసేంతవరకూ తన నివేదికను బహిరంగపర్చే ఉద్దేశం సెబీకి లేదని ఆ వర్గాలు వెల్లడించాయి. అదానీ గ్రూప్ లావాదేవీలపై దర్యాప్తును దాదాపుగా పూర్తిచేసినట్టు గత శుక్రవారం సుప్రీంకోర్టుకు సెబీ నివేదించిన సంగతి తెలిసిందే.
అదానీ గ్రూప్ తనకు సంబంధం ఉన్న ఆఫ్షోర్ కంపెనీలతో (విదేశాల్లో నెలకొల్పిన షెల్ కంపెనీలు) జరిపిన లావాదేవీలను వెల్లడించడంలో గ్రూప్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు సెబీ కనుగొన్నదని ఆ వర్గాలు తెలిపాయి. అయితే రిలేటెడ్ పార్టీతో జరిగిన లావాదేవీలను వెల్లడించకపోతే, భారత్లో లిస్టెడ్ కంపెనీ ఆర్థికాంశాలపై ప్రకటించినది తప్పుడు సమాచారమే అవుతుంది. గ్రూప్ సంబంధిత పార్టీలతో జరిగిన 13 లావాదేవీలను తాము పరిశీలించినట్టు సెబీ కోర్టు ఫైలింగ్లో తెలియపర్చింది. ఒక్కో ఉల్లంఘనకు గరిష్ఠంగా కోటి రూపాయల వరకూ పెనాల్టీ ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని అదానీ కంపెనీల్లో విదేశీ ఫండ్స్ వాటా నిబంధనలకు అనుగుణంగా లేవని కూడా దర్యాప్తులో వెల్లడయ్యిందని వారు వివరించారు.