Indian Currency | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేదిశగా ఎగుమతులకు రూపాయిల్లో చెల్లింపులు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. ముడి చమురు దిగుమతులకు భారత కరెన్సీని తీసుకునే సరఫరాదారులు దొరకడం లేదంటూ కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ పార్టమెంటరీ స్టాండింగ్ కమిటీకి తెలిపింది. అంతర్జాతీయ వాణిజ్య ప్రక్రియ ప్రకారం క్రూడాయిల్ దిగుమతి కాంట్రాక్టులు అన్నింటికీ యూఎస్ డాలర్ల రూపంలోనే చెల్లింపులు జరుగుతుంటాయి. అయితే భారత కరెన్సీని అంతర్జాతీయకరణ చేసేక్రమంలో దిగుమతిదార్లు రూపాయిల్ని చెల్లించేందుకు, ఎగుమతిదార్లు రూపాయిల్ని తీసుకునేందుకు రిజర్వ్బ్యాంక్ 2022 జూలై 11 నుంచి అనుమతులు మంజూరుచేసింది.
క్రాస్బోర్డర్ చెల్లింపుల్లో రూపాయి పాత్రని పెంచేందుకు 18 దేశాలతో రూపాయిల్లో వాణిజ్యాన్ని సెటిల్ చేసేందుకు డజనకుపైగా బ్యాంక్లను ఆర్బీఐ అనుమతించింది. కొన్ని దేశాలతో జరిగే చమురుయేతర వాణిజ్యంలో రూపాయి మారకం కొంత విజయవంతమైనప్పటికీ, చమురు ఎగుమతిదారులు మాత్రం భారత కరెన్సీలో చెల్లింపుల్ని అంగీకరించడం లేదు. రూపాయిల్ని డాలర్లలోకి మార్పిడి చేసుకోవడానికి లావాదేవీ వ్యయాలు అధికంగా ఉండటం, మారకపు రేటు తీవ్రహెచ్చుతగ్గులకు లోనుకావడం తదితర ఆందోళనలను క్రూడాయిల్ సరఫరాదారులు వ్యక్తం చేస్తున్నారని స్టాండింగ్ కమిటీకి చమురు మంత్రిత్వ శాఖ వివరించింది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ పెట్రో కంపెనీలు రూపాయి చెల్లింపుల ద్వారా క్రూడాయిల్ను ఏ మాత్రం దిగుమతి చేసుకోలేదని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రూపాయి చెల్లింపులతో భారమయ్యే అధిక లావాదేవీ వ్యయాల్ని సరఫరాదారులు తమకు మళ్లిస్తున్నారని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) వెల్లడించిందని మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి కొనుగోలు చేసిన క్రూడాయిల్కు భారత్ తొలిసారిగా ఈ ఏడాది ఆగస్టు నెలలో రూపాయిల్లో చెల్లింపులు జరిపినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇతర సరఫరాదారులతో కూడా ఇటువంటి డీల్స్ కుదుర్చుకునేందుకు చూస్తున్నామని , కానీ ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోలేదని చెప్పారు. రూపీ లావాదేవీల కోసం ఈ జూలైలో భారత్ యూఏఈతో ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ మేరకు అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీ నుంచి 10 లక్షల బ్యారళ్ల క్రూడాయిల్ కొన్నందుకు ఐవోసీ రూపీ చెల్లింపులు జరిపింది. అలాగే రష్యా నుంచి జరిగిన కొన్ని చమురు దిగుమతులకు కూడా భారత్ కరెన్సీలోనే సెటిల్మెంట్ జరిగింది.