Sensex | అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 85.63 డాలర్లకు దిగి వచ్చింది. గత 12 రోజుల్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 13 శాతం పతనమైంది. గతనెలలో వెహికల్స్ విక్రయాల్లో గ్రోత్, జీఎస్టీ వసూళ్లలో వృద్ధి వంటి అంశాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు వరుసగా మూడో సెషన్లో లాభాల బాట పట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ దాదాపు నెల రోజుల గరిష్టాన్ని తాకాయి. దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు సానుకూలంగా ఉండటం కూడా సూచీలకు కలిసి వచ్చింది. సెన్సెక్స్ 322 పాయింట్ల లబ్ధితో 60,115 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 17,936 పాయింట్ల వద్ద స్థిర పడింది. గత నెల 18న బీఎస్ఈ సెన్సెక్స్ 60 వేల మార్క్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 17,900 మార్క్ను దాటేశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ స్క్రిప్ట్లే నిఫ్టీలో 46 పాయింట్లు పెరిగి 17,900 మార్క్ దాటడానికి కారణం అయ్యాయి. అదానీ పోర్ట్స్తోపాటు టైటాన్, టెక్ మహీంద్రా, దివిస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ 2-3.7 శాతం లాభపడ్డాయి. కోల్ ఇండియా, శ్రీ సిమెంట్స్, నెస్ట్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, 0.5-2.5 శాతం మధ్య నష్టపోయాయి. నిఫ్టీ స్మాల్ క్యాప్-100, నిఫ్టీ మిడ్ క్యాప్-100 ఇండెక్స్లు 1-1.3 శాతం లాభ పడ్డాయి. నిఫ్టీ రియాల్టీ, మీడియా, నిఫ్టీ ఐటీ-కన్జూమర్ డ్యూరబుల్స్, పీఎస్యూ బ్యాంకుల వంటి సెక్టోరల్ ఇండెక్స్లు 1.2-1.5 శాతం మధ్య లబ్ధి పొందాయి.
నిఫ్టీలో సోమవారం ఉదయం 17,890.85 పాయింట్ల వద్ద చాలా ఉత్సాహంగా ట్రేడింగ్ మొదలైంది. ఇంట్రా డే ట్రేడింగ్లో గరిష్టంగా 17,980.55 పాయింట్లకు దూసుకెళ్లి.. అత్యంత కనిష్టంగా 17,889.15 పాయింట్లకు పడిపోయింది. ముగింపు సమయానికి 103 పాయింట్ల లబ్ధితో 17,936.35 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు సెన్సెక్స్ సైతం 59,912.29 పాయింట్ల వద్ద పాజిటివ్ లుక్తో మొదలైంది. ఇంట్రాడే ట్రేడింగ్లో 60,284.55 పాయింట్ల గరిష్టానికి.. తిరిగి 59,912.29 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. ట్రేడింగ్ ముగింపు దశలో 321.99 పాయింట్ల లాభంతో 60,115.13 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.79.53 వద్ద ముగిసింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ మళ్లీ 60 వేల మార్క్ను దాటింది. టెక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, విప్రో, ఎల్ అండ్ టీ, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్ షేర్లు లాభాలు గడించాయి. నెస్ట్లే ఇండియా, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, హెచ్యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతి, కొటక్ మహీంద్రా నష్టపోయాయి. అదానీ గ్రూప్ అనుబంధ అదానీ పోర్ట్స్ షేర్ సోమవారం ట్రేడింగ్లో మూడు శాతానికి పైగా లాభపడింది. రూ.934 వద్ద సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. గత వారం రోజుల్లో 10 శాతం, నెలలో 19 శాతం పుంజుకోవడం గమనార్హం.