గత వారపు అంచనాలకు అనుగుణంగా స్టాక్ మార్కెట్ కరెక్షన్ బాటలో నడిచింది. కొవిడ్, అమెరికా వడ్డీ రేట్ల పట్ల భయాలతో ఎన్ఎస్ఈ నిఫ్టీ వారం మొత్తంమీద 462 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి 17,807 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ 50 రోజుల సింపుల్ మూవింగ్ ఏవరేజ్ (50 ఎస్ఎంఏ) దిగువన ముగియడం, వీక్లీ చార్టుల్లో లాంగ్ బేరిష్ క్యాండిల్ను ప్రదర్శించినందున ఈ వారం మార్కెట్లో బలహీనత కొనసాగుతుందని, రికవరీ పరిమితంగానే ఉంటుందని అధికశాతం మంది విశ్లేషకులు చెపుతున్నారు.
స్వల్పకాలికంగా మార్కెట్ ఓవర్సోల్డ్ అయినందున, ఒకట్రెండు రోజుల్లో బౌన్స్ కావొచ్చని మరికొంతమంది అంచనా వేస్తున్నారు. అంచనాలకంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు అధికంగా తగ్గినందున సోమ లేదా మంగళవారాల్లో సూచీలు పటిష్టంగా బౌన్స్ అవుతాయని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ సంజీవ్ భాసిన్ చెప్పారు. రికవరీ జరిగినా పరిమితంగానే ఉంటుందని, గతవారం జరిగిన కరెక్షన్కు కేవలం రిట్రేస్మెంట్గానే ఈ బౌన్స్ ఉంటుందని 5పైసా.కామ్ రీసెర్చ్ హెడ్ రుచిత్ జైన్ తెలిపారు.
ఈ వారం నిఫ్టీ 18,000 దిగువన ఉన్నంతవరకూ కరెక్షన్ కొనసాగుతుందని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలా అంచనా వేశారు. 17,600-17,500 శ్రేణి వరకూ తగ్గవచ్చన్నారు. 18,000 పాయింట్ల అవరోధాన్ని అధిగమిస్తే 18,150-18,200 శ్రేణి వరకూ పెరగవచ్చని తెలిపారు. 17,950 దిగువన 17,650-17,500 శ్రేణి వరకూ క్షీణించవచ్చని, 17,950, 18,080 స్థాయిలు నిరోధించవచ్చని మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషకుడు చందన్ తపాడియా అంచనా వేశారు.