ముంబై, జనవరి 16: వరుస రికార్డులతో అదరగొట్టిన స్టాక్ మార్కెట్ మంగళవారం చిన్న బ్రేక్ తీసుకుంది. స్టాక్ సూచీలు ట్రేడింగ్ తొలిదశలో కొత్త రికార్డు గరిష్ఠస్థాయిల్ని చేరిన తర్వాత వెనక్కు మళ్లాయి. వరుసగా ఐదు రోజులపాటు ర్యాలీ జరిగిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో బీఎస్ఈ సెన్సెక్స్ 199 పాయింట్లు క్షీణించి 73,129 పాయింట్ల వద్ద ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో ఇది 73,428 పాయింట్ల వద్ద కొత్త రికార్డుస్థాయిని తాకింది. తాజాగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 22,124 పాయింట్ల ఆల్టైమ్ గరిష్ఠానికి చేరిన అనంతరం చివరకు 65 పాయింట్ల నష్టంతో 22,032 పాయింట్ల వద్ద ముగిసింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,972 పాయింట్లు, నిఫ్టీ 584 పాయింట్ల చొప్పున ర్యాలీ చేశాయి. స్టాక్ విలువలు అమాంతంగా పెరగడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని, అంతర్జాతీయ బలహీన సంకేతాలు ఇందుకు పురికొల్పాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఐటీ, రియల్టీ, ఎనర్జీ షేర్లలో లాభాల స్వీకరణ జరిగిందని, మెటల్, ఎఫ్ఎంసీజీ షేర్లు వెలుగులో నిలిచాయని రెలిగేర్ బ్రోకింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా వివరించారు.
ప్రధాన కంపెనీలు ఆర్థిక ఫలితాల్ని వెల్లడించిన తర్వాత అతిపెద్ద ర్యాలీ జరిపిన ఐటీ షేర్లు తాజాగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ షేర్లలో అన్నింటికంటే అధికంగా హెచ్సీఎల్ టెక్నాలజీస్ 2.05 శాతం క్షీణించగా, విప్రో 1.93 శాతం, ఇన్ఫోసిస్ 1.27 శాతం, టెక్ మహీంద్రా 1.17 శాతం, టీసీఎస్ 1.06 చొప్పున తగ్గాయి. ఇతర రంగాల షేర్లలో ఎన్టీపీసీ 1.84 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.43 శాతం మేర క్షీణించాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా, ఎం అండ్ ఎం, పవర్గ్రిడ్, భారతి ఎయిర్టెల్, ఎస్బీఐలు సైతం నష్టాలతో ముగిసాయి. మరో వైపు టాటా స్టీల్, టైటాన్, మారుతి, లార్సన్ అండ్ టుబ్రో, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్లు 1-2 శాతం మధ్య లాభపడ్డాయి.
ఆసియాలో సియోల్, టోక్యో, హాంకాంగ్ సూచీలు తగ్గగా, షాంఘై పాజిటివ్గా ముగిసింది. యూరప్లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ స్టాక్ సూచీలు కూడా తగ్గాయి. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 78 డాలర్ల ఎగువన ట్రేడవుతున్నది. సోమవారం రూ. 1,085 కోట్ల నికర కొనుగోళ్లు జరిపిన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) మంగళవారం మరో రూ.650 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
మంగళవారంనాటి ట్రేడింగ్ ప్రథమార్థంలో బుల్స్ ఆధిపత్యం చెలాయించగా, ద్వితీయార్థంలో బేర్స్ పట్టుచిక్కించుకున్నారని ఎల్కేపీ సెక్యూరిటీస్ డెరివేటివ్ అనలిస్ట్ కునాల్ షా చెప్పారు. తదుపరి ఒకటి, రెండు రోజుల్లో నిఫ్టీ 22,300 పాయింట్లకు చేరాలంటే 21,150 స్థాయిని బ్రేక్చేసి నిలదొక్కుకోవాలని విశ్లేషించారు. 21,950 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నదన్నారు.