న్యూఢిల్లీ : కరోనా మహమ్మారితో గత రెండేండ్లుగా వర్క్ ఫ్రం హోంకు మొగ్గుచూపిన ఐటీ కంపెనీలు వైరస్ వ్యాప్తి తగ్గడంతో కొన్ని కంపెనీలు క్రమంగా కార్యాలయాల బాట పడుతున్నాయి. పలు ఐటీ కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం కొనసాగిస్తుండగా అత్యధిక శాతం కంపెనీలు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అమలు చేస్తూ ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తున్నాయి. హైబ్రిడ్ వర్క్ కల్చర్తో ప్రయోజనాలు, వెసులుబాట్లను గుర్తించిన ఐటీ కంపెనీలు, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఈ పద్ధతిని కొనసాగించేందుకు మొగ్గుచూపుతున్నాయి.
ఉద్యోగుల వీలును బట్టి కంపెనీలు రిమోట్ వర్క్తో పాటు ఆన్ సైట్ వర్కింగ్ ఆప్షన్లను ఇస్తున్నాయి. ఇతర పరిశ్రమలతో పోలిస్తే 80 శాతం ఐటీ కంపెనీలు, జీసీసీలు హైబ్రిడ్ వర్క్ మోడల్ను అనుసరిస్తాయని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ)తో కలిసి భారత్లో భవిష్యత్ పని పద్ధతుల పేరుతో వెల్లడించిన నాస్కామ్ నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాల తీరుతెన్నులు పనిపద్ధతులను మార్చివేసిందని, రిమోట్, హైబ్రిడ్ వర్క్ పద్ధతుల వంటి పలు మార్పులకు కంపెనీలు లోనయ్యాయని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవ్జని ఘోష్ అన్నారు.
సాధారణ స్ధితికి చేరుకునే క్రమంలో ఆయా కంపెనీలు తమ ఉద్యోగులకు ఆన్లైన్, ఆఫ్లైన్లో పనిచేసే వెసులుబాటును పరిశీలించాలని పేర్కొన్నారు. భవిష్యత్ పని వ్యవస్ధలను డిజైన్ చేసే క్రమంలో నూతన వర్కింగ్ మోడల్స్, ట్రెండ్స్ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. భవిష్యత్ వర్క్ప్లేస్ను నిర్ధారించేందుకు టెక్ పరిశ్రమ వినూత్న పద్ధతులతో ముందుకెళుతుందని బీసీజీ ఇండియా ఎండీ, పార్ట్నర్ నితిన్ చందలియా అన్నారు.ఇక హైబ్రిడ్ వర్క్లో భాగంగా ఉద్యోగులు వారంలో కొన్ని రోజులు ఇంటి నుంచి మరికొన్ని రోజులు ఆఫీస్ నుంచి పనిచేస్తుంటారు.