న్యూఢిల్లీ, ఏప్రిల్ 20 : పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతమ్ అదానీ గ్రూప్ షేర్లలో దేశీ మ్యూచువల్ ఫండ్స్ తమ వాటాను తగ్గించుకుంటున్నాయి. దేశంలో ఈక్విటీ మ్యూచువల్ ఫం డ్స్ ఆస్తుల విలువ రూ.14. 95 లక్షల కోట్లలో అదానీ గ్రూ ప్లో ఉన్న పెట్టుబడుల వాటా 2023 మా ర్చి చివరినాటికి 0.9 శాతానికి తగ్గింది. 2022 డిసెంబర్లో ఈ వాటా 2 శాతం మేర ఉంది. ముఖ్యంగా అదానీ అవకతవకలు, పారదర్శకతపై అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ ఈ ఏడాది జనవరి 24న రిపోర్ట్ విడుదల చేసిన తర్వాత దేశీ ఫండ్ మేనేజర్లు ఈ గ్రూప్ షేర్లను వేగంగా విక్రయించారు. ఈ గ్రూప్లోని వివిధ కంపెనీల్లో 2022 డిసెంబర్ 31నాటికి 29 కోట్ల షేర్లను మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తుండగా, తాజాగా ఆ హోల్డింగ్ 20 కోట్ల షేర్లకు పడిపోయింది. కార్పొరేట్ గవర్నెన్స్ వివాదాలున్న కంపెనీలకు సాధారణంగా ఫండ్స్ దూరం జరుగుతుంటాయని విశ్లేషకులు తెలిపారు. మార్కెట్లో ప్రస్తుతం 10 అదానీ గ్రూప్ షేర్లు ట్రేడవుతుండగా, వాటిలో ఎన్డీటీవీ మినహా మిగిలిన 9 షేర్లలోనూ ఫండ్స్ పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ఆరు షేర్ల నుంచి ఫండ్ మేనేజర్లు కొంతవరకూ పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు.
ఐదు కంపెనీల్లో అమ్మకాలు
ముగిసిన త్రైమాసికంలో ఆరు అదానీ గ్రూప్ కంపెనీల్లో షేర్లను ఫండ్స్ విక్రయించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్లో మ్యూచువల్ ఫండ్స్ వాటా మార్చి చివరినాటికి 0.87 శాతానికి తగ్గింది. డిసెంబర్లో 1.19 శాతంగా ఉంది. అదానీ పోర్ట్స్లో వాటాను 4.43 శాతం నుంచి 3.09 శాతానికి కుదించుకున్నాయి. అంబుజాలో వాటాను 5.8 శాతానికి తగ్గించుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్లో సైతం ఫండ్స్ వాటాలను కొంతమేర విక్రయించాయి. కానీ అదానీ పవర్లో మాత్రం 0.1 శాతం వాటాను కొనుగోలు చేశాయి. అంతక్రితం ఈ షేరు ఎంఎఫ్ల పోర్ట్ఫోలియోలో లేదు. అదానీ గ్రూప్నకు దేశీ ఫండ్స్ దూరం జరుగుతుండగా, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో నడిచే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మాత్రం ఆ షేర్లలో వాటాలను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే.