న్యూఢిల్లీ : పిల్లల ఎడ్యుకేషన్, మెరుగైన భవిష్యత్ కోసం ఎన్నో పెట్టుబడి పధకాలు అందుబాటులో ఉన్న సరైన స్కీమ్ ఎంచుకోవడం అంత సులభం కాదు. పిల్లల కోసం మెరుగైన పధకాల కోసం చూసే కంటే వైవిధ్యమైన పెట్టుబడులను ఎంచుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్ ల వంటివీ ఉపయుక్తంగా ఉంటాయని చెబుతున్నారు. మీ దీర్ఘకాల లక్ష్యాలకు ఏయే పధకాలు ఉపయోగపడతాయనేదే కీలకం.
పెట్టుబడి పధకాలను ఎంచుకునేముందు ద్రవ్యోల్బణాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి ఆరు శాతం వార్షిక ద్రవ్యోల్బణాన్ని లెక్కలోకి తీసుకుంటే ప్రస్తుతం రూ 5 లక్షలుగా ఉన్న ఇంజనీరింగ్ కోర్సు ఖర్చు 15 ఏండ్ల తర్వాత రూ 12 లక్షలకు ఎగబాకుతుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 15 ఏండ్ల తర్వాత రూ 12 లక్షలు పొందేందుకు మనం నెలకు రూ 2500 మదుపు చేయాల్సి ఉంటుంది. పిల్లల కోసం మెరుగైన పధకాలను చూద్దాం..
పదేండ్ల లోపు బాలికల పేరుతో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్ వై) లో పెట్టుబడి పెట్టవచ్చు. కుటుంబంలో ఇద్దరు బాలికల వరకూ బ్యాంకు లేదా పోస్టాఫీసులో ఎస్ఎస్ వై ని ఓపెన్ చేయవచ్చు. ఈ ఖాతాను తెరిచేందుకు కనీస డిపాజిట్ మొత్తం రూ 250. ఏడాదికి రూ 1.5 లక్షల వరకూ ఈ ఖాతాలో జమ చేయవచ్చు. స్కీమ్ కాలపరిమితి 21 ఏండ్లు కాగా 15 ఏండ్ల పాటు మదుపు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు బాలిక వయసు ఆరేండ్లు అయిఏ ఆమెకు 27 ఏండ్లు వచ్చిన తర్వాత ఎస్ఎస్ వై ఖాతా మెచ్యూర్ అవుతుంది.
బాలికకు 18 ఏండ్ల వయసు వస్తే ఆమె పెండ్లి ఖర్చులకు కుటుంబ సభ్యులు నగదును తీసుకునే వెసులుబాటు ఉంటుంది. బాలిక ఉన్నత విద్య కోసం ఖాతాలో 50 శాతం మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు. బాలిక పెండ్లి నిమిత్తం 21 ఏండ్లకు ముందుగానే ఖాతాను క్లోజ్ చేసి నగదును విత్ డ్రా చేసుకునేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. అయితే ఇందుకు బాలికకు 18 ఏండ్లు నిండాయని అఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంటుంది.
మీ పేరుతో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) ఖాతా ఉన్నా మీ చిన్నారి పేరుతో మరో ఖాతాను తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ ఖాతాలో ఏడాదికి గరిష్టంగా రూ 1.5 లక్షలు జమ చేయవచ్చు. మీ ఖాతాతో పాటు మీ చిన్నారి పేరుతో ఉన్న ఖాతాలోనూ మదుపు చేయవచ్చు. పీపీఎఫ్లో మదుపు చేసిన అసలు మొత్తానికి ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
పిల్లల అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రీమియం రద్దుతో కూడిన కొన్ని జీవిత బీమా పధకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పధకంలో పాలసీదారు మరణించినా, అశక్తతకు గురైనా పాలసీ ఆగిపోవడం కానీ, పాలసీ ఇనాక్టివ్ కావడం కానీ జరగదు. ఇన్సూరర్ ప్రీమియాన్ని చెల్లిస్తూ పాలసీని కొనసాగిస్తారు. దీంతో చిన్నారి ఎదిగే సమయానికి ఫండ్ వ్యాల్యూ చేతికందుతుంది.
ఇక పిల్లల విద్య, వివాహం కోసం మదుపు చేసే తల్లితండ్రులు ఈక్విటీ మ్యూచ్ వల్ ఫండ్స్ లో మదుపు చేస్తే కనీసం ఏడేండ్ల పాటు వాటిని కొనసాగించాలా చూడాలి. లార్జ్, మిడ్ క్యాప్ ఫండ్స్ లో పెట్టుబడులు కొనసాగించాలి. ఇండెక్స్ ఫండ్స్ లోనూ మదుపు చేయాలి. ప్రత్యేకంగా పిల్లల కోసం మ్యూచ్ వల్ ఫండ్స్ పోర్ట్ పోలియోను దీర్ఘకాలం కొనసాగిస్తే ద్రవ్యోల్బణానికి దీటైన నిధులు వారికి సరైన తరుణంలో అందివస్తాయి.
పిల్లల భవిష్యత్ కోసం చాలామంది తల్లితండ్రులు బంగారంలో మదుపు చేస్తుంటారు. అయితే భౌతికంగా బంగారాన్ని కలిగిఉండటంతో పాటు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)లో పెట్టుబడి పెట్టవచ్చు. మ్యూచ్ వల్ ఫండ్స్ తరహాలోనే వీటిని కొనుగోలు చేసే వెసులుబాటు ఉండటంతో గోల్డ్ ఈటీఎఫ్స్ ను పేపర్ గోల్డ్ గా పిలుస్తుంటారు. గోల్డ్ యూనిట్లను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలతో కూడిన స్టాక్ ఎక్స్ఛేంజ్ లో కొనుగోలు చేయడం ద్వారా ఈ పెట్టుబడులను పెంచుకోవచ్చు. ఒక గ్రాము బంగారంతో కూడా మదుపు చేసి దీర్ఘకాలంలో ఎక్కువ బంగారాన్ని సమీకరించుకోవచ్చు. ఇక ఇదే తరహాలో ప్రభుత్వం తరచూ జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్స్ లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. ఇవి ఎనిమిదేండ్ల మెచ్యూరిటి వ్యవధిలో అందుబాటులో ఉంటాయి.