Naresh Goyal – Jet Airways | హవాలా లావాదేవీల కేసులో అరెస్టయిన జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. హవాలా లావాదేవీల కేసులో నరేశ్ గోయల్, ఆయన సతీమణిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గతేడాది అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న నరేశ్ గోయల్ తాను టర్మినల్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంటూ అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేయాలని నరేశ్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు జస్టిస్ ఎన్జే జమాదార్ సారధ్యంలోని సింగిల్ బెంచ్ స్వీకరించింది. దీనిపై మే మూడో తేదీన విచారిస్తామని తెలిపింది.
సైకాలజికల్ నివేదిక ప్రకారం తన మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిన్నదని, దీనివల్ల తీవ్ర లొంగుబాటుకు గురయ్యానని, ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని బెయిల్ పిటిషన్ లో తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు బెయిల్ ఇవ్వకపోవడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ సంస్థకు ఇచ్చిన రూ.538.62 కోట్ల రుణాలను, ఇతర నిధులను దారి మళ్లించారని కెనరా బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మీద నరేశ్ గోయల్ను 2023 సెప్టెంబర్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన భార్య అనితా గోయల్ను గత నవంబర్లో అరెస్ట్ చేశారు. అయితే, ఆమె వయస్సు, ఆరోగ్య పరిస్థితి ఆధారంగా ప్రత్యేక న్యాయస్థానం అనితా గోయల్ కు బెయిల్ మంజూరు చేసింది.
క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న నరేశ్ గోయల్ దవాఖానలో చికిత్స పొందేందుకు ప్రత్యేక న్యాయస్థానం గత ఫిబ్రవరిలో రెండు నెలల రిలీఫ్ కల్పించింది. ఆయన ఎంచుకున్న దవాఖానలో చికిత్స పొందేందుకు తమకు అంగీకారమేనని పేర్కొన్న ప్రత్యేక న్యాయస్థానం.. బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.