Banking Crisis | దేశీయ బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠిపై కేంద్రంలోని మోదీ సర్కారుకు అనుమానాలున్నాయా..! అందుకే ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల బాండ్ పోర్ట్ఫోలియోల సమాచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరిందా..! అమెరికా, యూరప్ల్లోని బ్యాంకింగ్ సంక్షోభం.. భారత్లోనూ వస్తుందని కేంద్రం భయపడుతున్నదా..? జాగ్రత్త పడుతున్నదా..?
న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం జరిగే వీలుండటంతో ఇది అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ), సిగ్నేచర్ బ్యాంక్.. యూరప్లో క్రెడిట్ స్విస్ బ్యాంక్ల ద్రవ్య సంక్షోభం మధ్య మోదీ సర్కారు నిర్ణయం చర్చనీయాంశమైందిప్పుడు. 25న త్రైమాసిక బ్యాంకింగ్ సమీక్షా సమావేశం జరిగే అవకాశాలుండగా, అంతకంటే ముందే బాండ్ పోర్ట్ఫోలియోల డాటాను కేంద్రం కోరినట్టు ఏడు ప్రభుత్వ బ్యాంకుల వర్గాలు చెప్తున్నాయి.
ఎస్వీబీ, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్విస్ బ్యాంక్ల తరహాలోనే భారతీయ బ్యాంకులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒత్తిడిని ఏమైనా ఎదుర్కొంటున్నాయా? అన్న అనుమానాలు కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే హెల్డ్-టు-మెచ్యూరిటీ (హెచ్టీఎం) పోర్ట్ఫోలియోలు, అలాగే ట్రేడింగ్ పుస్తకాల్లో మార్క్-టు-మార్కెట్ (ఎంటీఎం) నష్టాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆరా తీస్తున్నట్టు ఓ సీనియర్ బ్యాంకర్ చెప్తున్నారు. తద్వారా బ్యాంకుల్లో ఒత్తిడిని గుర్తించాలని చూస్తున్నారన్నారు. కొద్దిరోజుల క్రితమే ఈ డాటా సేకరణ మొదలైందని కూడా తెలిపారు. మరోవైపు దీనిపై స్పందించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు ఇష్టపడటం లేదు.
కొనుగోలు చేసే బాండ్లను మెచ్యూరిటీ సమయం వచ్చేదాకా బ్యాంకులు ఉంచుకుంటాయి. దీనినే హెచ్టీఎం అంటారు. సాధారణంగా వీటిలో ప్రభుత్వ బాండ్లే ఎక్కువ. బ్యాంకింగ్ ఇన్వెస్ట్మెంట్ పుస్తకాల్లో 60 శాతం ఈ హెచ్టీఎం బాండ్లు ఉండటం గమనార్హం. ఈ బాండ్ల ధరల మార్పులకు తగినట్టు ఎంటీఎం నష్టాలు/లాభాలను బ్యాంక్ పుస్తకాల్లో చూపించాలి. అయితే అమెరికా, ఐరోపా బ్యాంకుల సంక్షోభం నేపథ్యంలో భారతీయ బ్యాంకుల్లోని హెచ్టీఎం బాండ్ల పట్ల అంతర్జాతీయ మదుపరుల్లో ఇప్పుడు ఆందోళనలు బయలుదేరాయి. ఎక్కడ తమకు నష్టాలు వాటిల్లుతాయేమోనన్న భయాలు గ్లోబల్ ఇన్వెస్టర్లలో కనిపిస్తున్నాయి.
బలమైన మూలధన నిల్వలున్నందున భారీ ఎంటీఎం నష్టాలకు ఆస్కారం ఉండబోదని దేశీయ బ్యాంకర్లు అంటున్నారు. పైగా ప్రభుత్వ బాండ్ల ఈల్డ్స్ క్రమేణా పెరుగుతున్నాయని గుర్తుచేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఇప్పటిదాకా భారతీయ పదేండ్ల ప్రామాణిక బాండ్ ఈల్డ్ 50 బేసిస్ పాయింట్లు పెరిగిందని వివరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచడం కూడా కలిసొచ్చిందని పేర్కొంటున్నారు. వచ్చే ద్రవ్యసమీక్షలో రెపోరేటు మరో 25 బేసిస్ పాయింట్లు పెరిగి 6.75 శాతానికి చేరుకోవచ్చనీ అంచనా వేస్తున్నారు.