Budget 2024-25 | దశల వారీగా సమయోచితంగా రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సర తాత్కాలిక బడ్జెట్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్సభలో ప్రవేశపెడుతూ ఈ సంగతి చెప్పారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు దేశం పలు సవాళ్లను ఎదుర్కొన్నదని, ప్రస్తుతం సుసంపన్నంగా ఎదిగిందని పేర్కొన్నారు. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ సరఫరా చేయడం ద్వారా ఆహార కొరతపై నెలకొన్న ఆందోళనను తొలగించామన్నారు. తమ ప్రభుత్వం అద్భుతమైన పనితీరు వల్ల దేశ ప్రజలు తిరిగి స్పష్టమైన తీర్పు ఇచ్చి దీవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
తొలి నుంచి దేశంలో ఏర్పాటైన బలమైన పునాదులతో కొవిడ్-19 సవాళ్లను దేశం ఎదుర్కోవడంతోపాటు స్వావలంభన సాధించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి కలుపుకుని తమ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. సంస్థాగత సంస్కరణలు, ప్రజల అనుకూల విధానాలతో ఉపాధి అవకాశాల కల్పన ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కొత్త శక్తిని సంతరించుకుంటుందని అన్నారు. భారత ప్రజలు ఉజ్వల భవిష్యత్ పట్ల ఆశావాహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత పదేండ్లలో తమ ప్రభుత్వం గత పదేండ్లలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు.