న్యూయార్క్ : కరోనా మహమ్మారితో ఆర్ధిక వ్యవస్ధ కుదేలవడంతో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగై నిరుద్యోగం ప్రబలిన పరిస్ధితి నుంచి ప్రపంచం తేరుకోవడంతో నియామకాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఐటీ నుంచి నిర్మాణ రంగం, హెల్త్కేర్ నుంచి టూరిజం వరకూ హైరింగ్ జోరు కనిపిస్తోంది. మరోవైపు మహమ్మారి విజృంభణతో రిమోట్ వర్కింగ్తో ఇంటి నుంచే పనిచేసిన వైట్ కాలర్ ఉద్యోగులు జాబ్ మారేందుకు ఇదే అనువైన సమయంగా భావిస్తున్నారు.
అధిక వేతనం, పనిగంటల వెసులుబాటు అనుకూలంగా ఉంటే దశాబ్ధాల అనుభవం ఉన్న ఉద్యోగులు కూడా కెరీర్ను, పనిచేస్తున్న కంపెనీని వదిలి వేరే ఉద్యోగాలు చూసుకునేందుకు రిస్క్ చేస్తున్నారు. వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరుగుతుండటంతో వ్యాపారాలు గాడినపడి ఆయా కంపెనీలు ఇప్పుడు కొత్త నైపుణ్యాలను వెతికే పనిలో పడటం, మరికొన్ని కంపెనీలను సిబ్బంది కొరత వెంటాడుతుండటంతో కొత్త జాబ్లు, కెరీర్ల దిశగా ఉద్యోగులు యోచిస్తున్నారు.
ఉద్యోగులు ఈ తరహాలో ఆలోచిస్తుండగా ఈ మైండ్సెట్ గ్రేట్ రిజిగ్నేషన్ దిశగా సాగుతున్నదని ప్రముఖ యూఎస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ అభివర్ణించారు. అమెరికాతో పాటు యూరప్లోనూ ఈ ట్రెండ్ వేగంగా ప్రబలుతోంది. జర్మనీలో మూడింట ఓ వంతు కంపెనీలు తాము సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్నామని వెల్లడించాయని ఐఎఫ్ఓ ఇనిస్టిట్యూట్ చేపట్టిన సర్వే పేర్కొంది. ఈ ఏడాది తాము పనిచేస్తున్న కంపెనీలకు గుడ్బై చెప్పాలని ప్రపంచవ్యాప్తంగా 41 శాతం మంది ఉద్యోగులు భావిస్తున్నారని మైక్రోసాఫ్ట్ 2021 వర్క్ ట్రెండ్స్ ఇండెక్స్ వెల్లడించింది.