హైదరాబాద్లో 467 మంది అపర కుబేరులు
దేశంలోనే రెండో స్థానం
డాలర్ బిలియనీర్లలో భారత్కు 3వ ర్యాంకు
నైట్ఫ్రాంక్ వెల్త్ రిపోర్టు వెల్లడి
2026 నాటికి మరో 56 శాతం పెరుగుతారని అంచనా
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 : దేశంలో అత్యంత సంపన్నులున్న నగరాల జాబితాలో హైదరాబాద్కు రెండో స్థానం దక్కింది. ముంబై తర్వాత భాగ్యనగరంలోనే అత్యధికంగా అపర కుబేరులు (అల్ట్రా-హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ లేదా యూహెచ్ఎన్డబ్ల్యూఐ) ఉన్నారంటూ ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తాజాగా వెల్లడించిన వెల్త్ రిపోర్టు-2022లో పేర్కొన్నది. దాదాపు రూ.226 కోట్లు ఆపై సంపద (30 మిలియన్ డాలర్లు) కలిగిన వారితో ఈ జాబితాను రూపొందించారు. దీంతో ముంబైలో వీరి సంఖ్య అత్యధికంగా 1,596గా ఉంటే, హైదరాబాద్లో 467 మంది ఉన్నారని తేలింది. 2016 నుంచి 2021 వరకు భాగ్యనగరంలో శ్రీమంతుల వృద్ధిరేటు 48.7 శాతంగా ఉన్నదని, 2026 నాటికి మరో 56 శాతం పెరిగి 728కి చేరుకుంటారని వెల్లడించింది.
ఈక్విటీలు, డిజిటలైజేషన్తో..
దేశవ్యాప్తంగా ఉన్న సంపన్నులు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజాల్ తెలిపారు. ప్రధానంగా ఈక్విటీ మార్కెట్లు, డిజిటలైజేషన్ బాగా పెరగడంతో అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్య కూడా ఎగబాకిందన్నారు. కొత్తగా పెట్టుబడుల విధానాలు అమల్లోకి రావడం, సరికొత్త ఆవిష్కరణలు జరుగుతుండటంతో సంపద ఒక్కసారిగా పెరుగుతోందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంపన్నుల జాబితాలో భారత్ ఎంతో కీలకంగా మారిందని పేర్కొన్నారు.
రియల్ ఎస్టేట్లోనే..
రియల్ ఎస్టేట్లోనే సంపన్నులు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నట్టు తాజా నివేదికలో తేలింది. 29 శాతం పెట్టుబడులు రియల్టీలోకే వెళ్తున్నాయి. ఇందులో 22 శాతం కమర్షియల్ ప్రాపర్టీ కోసమే వెచ్చిస్తుండటం గమనార్హం. మిగతా పెట్టుబడులు వృద్ధికి అవకాశం ఉన్న స్థిరాస్తులకు వెళ్తున్నాయి. కాగా, గతేడాది తమ మొత్తం సంపదలో 60 శాతం వరకు రియల్ పెట్టుబడులకే సంపన్నులు కేటాయించడం విశేషం.
నైట్ ఫ్రాంక్ నివేదిక ముఖ్యాంశాలు