న్యూఢిల్లీ, ఆగస్టు 29: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. వచ్చే ఎనిమిదేండ్లలో ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి రూ.45 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ప్రస్తుతం ఏడాదికి 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థ..వచ్చే ఎనిమిదేండ్లలో ప్రొడక్షన్ కెపాసిటీ 40 లక్షలకు పెంచుకోనున్నట్లు ఆయన ప్రకటించారు.
ఉద్గారానికి సంబంధించిన సమస్యలు తలెత్తడంతో మారుతి సుజుకీ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది మారుతి సుజుకీ. నూతన టెక్నాలజీతో తయారవుతున్న మాడళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్స్, సీఎన్జీ, ఈథనాల్-బ్లెండెడ్ మాడళ్లను తీర్చిదిద్దడానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. వచ్చే ఎనిమిది నుంచి పదేండ్ల కాలంలో ఆటోమొబైల్ రంగంలో పూర్తిగా మారిపోనున్నదని, ముఖ్యంగా టెక్నాలజీకి పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టిన తొలి 40 ఏండ్లలో 20 లక్షల యూనిట్ల మైలురాయికి చేరుకున్నట్లు, మరో 20 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయడానికి మరో ఎనిమిదేండ్లు పట్టవచ్చునన్నారు. మారుతి 3.0లో భాగంగా వచ్చే ఎనిమిదేండ్లకాలంలో 20 లక్షల వాహనాల కోసం కొత్తగా 28 మాడళ్లను ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.