న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి అక్టోబర్లో 1.80 లక్షల కార్లను ఉత్పత్తి చేసేందుకు సన్నద్ధమవుతోంది. అక్టోబర్లో భారీ సరఫరాలపై విక్రేతలకు మారుతి సమాచారం చేరవేసింది. ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చిప్సెట్స్ సేకరించేందుకు వివిధ మార్గాల్లో మారుతి సుజుకి ఏర్పాట్లు చేపట్టింది. మారుతి తన లక్ష్యాన్ని చేరుకుంటే అక్టోబర్లో ఉత్పత్తులు సెప్టెంబ్తో పోలిస్తే 60 నుంచి 80 శాతం అధికంగా ఉండనున్నాయి.
ఇక సెమికండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా కొరత ఏర్పడటంతో సెప్టెంబర్లో ఉత్పత్తులను లక్ష యూనిట్లకు మారుతి పరిమితం చేసింది. మలేషియాలో కొవిడ్-19 పరిస్థితి మెరుగవడంతో చిప్స్ సేకరణలో మారుతికి ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు.
మలేషియాలో చిప్ తయారీ కేంద్రాలు ప్రస్తుతం వారానికి మూడు షిఫ్ట్ల్లో ఏడు రోజులూ పనిచేస్తున్నాయి. మారుతి లక్ష్యంగా నిర్ధేశించుకున్న కార్ల ఉత్పత్తిలో మూడింట రెండు వంతులు జాతీయ రాజధాని ప్రాంతంలోని కంపెనీ సొంత ప్లాంట్ల నుంచే సమకూరుతుంది. మిగిలిన యూనిట్లు సుజుకి మోటార్ గుజరాత్ ఫెసిలిటీల నుంచి అందుబాటులోకి రానున్నాయి.