Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి బ్రేక్ పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫోసిస్ గ్రోత్ గైడెన్స్ బలహీనంగా ఉండటంతోపాటు మార్కెట్ అంచనాల కంటే తక్కువగా నమోదు కావడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా ఐటీ, టెక్నాలజీ, టెలికం స్టాక్స్పై అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఇంట్రాడే ట్రేడింగ్లో దాదాపు 15 శాతం నష్టపోయిన ఇన్పోసిస్ ట్రేడింగ్ ముగిసే సమయానికి తొమ్మిది శాతం నష్టంతో సరిపెట్టుకున్నది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ స్టాక్స్ సైతం నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రా డే ట్రేడింగ్లో సెన్సెక్స్ 988.53 పాయింట్లు (1.63 శాతం) పతనంతో 59,442.47 పాయింట్లకు పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 121.15 పాయింట్ల (0.68 శాతం) నష్టంతో 17,706.85 పాయింట్ల వద్ద ముగిసింది.
గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో నికర లాభాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ గైడెన్స్ మార్కెట్ అంచనాల కంటే తక్కువగా 4-7 శాతం ఉంటుందని పేర్కొనడంతో సెన్సెక్స్లో ఇన్ఫోసిస్ భారీగా నష్టపోయింది. ఇంట్రా డే ట్రేడింగ్లో దాదాపు 15 శాతం వరకు పతనమైన ఇన్ఫీ స్క్రిప్ట్.. ముగింపు సమయానికి పుంజుకుని తొమ్మిది శాతం నష్టంతో సరిపెట్టుకున్నది. అమెరికా బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నేపథ్యంలో పలు క్లయింట్లు తమ ఐటీ బడ్జెట్లలో సర్దుబాటు చేసుకోవడంతో వల్ల ఇన్ఫోసిస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సర గైడెన్స్ తగ్గించేసింది.
ఇంకా బీఎస్ఈ సెన్సెక్స్లో టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, విప్రో, హెచ్డీఎఫ్సీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. మరోవైపు నెస్ట్లే, పవర్ గ్రిడ్, భారతీయ స్టేట్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్ తదితర స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి.
దక్షిణ కొరియా సియోల్, జపాన్, షాంఘై, హంకాంగ్ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈయూ దేశాల్లో మార్కెట్లు మధ్యాహ్నం ట్రేడింగ్లో పుంజుకున్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో స్థిర పడ్డాయి. దేశీయ స్టాక్మార్కెట్లకు బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం సెలవు. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.31 శాతం తగ్గి 86.04 డాలర్లు పలికింది.
`అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సర గైడెన్స్పై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆచితూచి స్పందించింది. అంచనాల కంటే తక్కువగా త్రైమాసికం ఫలితాలు ప్రకటించడంతో మార్కెట్లు ప్రతికూలంగా ప్రతిస్పందించాయి. మరోవైపు అమెరికాలో పదేండ్ల బాండ్ల విలువ పెరిగింది. అమెరికా ఉద్యోగాల గణాంకాలు మున్ముందు ఫెడ్ రిజర్వ్ మరిన్ని వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉంది. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ సంస్థల త్రైమాసికం ఫలితాలు మున్ముందు మార్కెట్ ధోరణులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, టెలికం, ఎఫ్ఎంసీజీ సెక్టార్ల దన్నుతో నిఫ్టీ-50 స్టాక్ సంస్థలు గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నికర లాభాల్లో 10 శాతం గ్రోత్ నమోదు చేయొచ్చు` అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ వ్యాఖ్యానించారు.