అదానీ గ్రూప్ షేర్ల పతనానికి తోడు అమెరికా ఫెడ్ మరింతగా వడ్డీ రేట్లను పెంచుతుందన్న భయాలతో గతవారం ఐదు ట్రేడింగ్ రోజులూ దేశీ మార్కెట్ పతనాన్ని చవిచూసింది. దీంతో ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీగా 478 పాయింట్లు క్షీణతతో 17,466 పాయింట్ల వద్ద ముగిసింది. కీలకమైన మూవింగ్ ఏవరేజ్లను కోల్పోయినందున, రానున్న కొద్ది రోజుల్లో మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వల్పకాలంలో బౌన్స్ అయినా, గరిష్ఠ స్థాయిలో సూచీలు నిలదొక్కుకోలేవని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అమోల్ అథేవాలా విశ్లేషించారు.
కొత్త కనిష్ఠంవైపు నిఫ్టీ
శుక్రవారంనాటి నిఫ్టీ డెయిలీ చార్ట్లో లాంగ్ బేర్ క్యాండిల్ ఏర్పడటంతోపాటు వీక్లీ చార్టుల్లో లోయర్ టాప్స్, బాటమ్స్ నెలకొన్నాయని, ఈ సంకేతాలు డౌన్ట్రెండ్ ప్యాట్రన్ను సూచిస్తున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి చెప్పారు. ఈ ప్యాట్రన్ ప్రకారం నిఫ్టీ కొత్త కనిష్ఠ స్థాయివైపు (బడ్జెట్నాటి కనిష్ఠం 17,353 దిగువకు) పయనించవచ్చని అంచనా వేశారు.
ఈ వారం నిఫ్టీ 17,350 పాయింట్ల వరకూ తగ్గవచ్చని, 17,800 పాయింట్ల సమీపంలో అవరోధం కలగవచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ రూపక్ డే అంచనా వేశారు. నిఫ్టీ 17,500పైన ట్రేడ్ కాగలిగితే 17,600-17,750 పాయింట్ల శ్రేణి వరకూ పుల్బ్యాక్ ర్యాలీ జరగవచ్చని అమోల్ అథేవాలే తెలిపారు.