Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ఆల్టైం రికార్డు నెలకొల్పాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్ 803 పాయింట్లు లాభ పడి 64,718 పాయింట్ల వద్ద స్థిర పడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 216.25 పాయింట్ల లబ్ధితో 19,189.05 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు ఇండెక్స్లు ఆల్ టైమ్ రికార్డు నమోదు చేశాయి.
శుక్రవారం ఉదయం నుంచి స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ లాభాల్లోనే సాగింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడే ట్రేడింగ్లో 64,768 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 19201 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకున్నది. రెండు సూచీలు 52 వారాల గరిష్ట స్థాయి నమోదు చేశాయి. ఇంతకుముందు గత బుధవారం కూడా ఆల్ టైం హై రికార్డు స్థాయికి దూసుకెళ్లాయి.
ముడి చమురు ధరలు తగ్గడంతోపాటు ద్రవ్యోల్బణం దిగి రావడం స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లడానికి కారణం అని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ వైస్ ప్రెసిడెండ్ అనూజ్ గుప్తా తెలిపారు. డాలర్ మీద రూపాయి మారకం విలువ బలోపేతం కావడం, దేశీయ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పెరగడం, ఫారెక్స్ రిజర్వు నిల్వలు బలోపేతం కావడంతో స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్లో రెండు స్టాక్స్ మినహా అన్ని దూసుకెళ్లాయి. మరోవైపు నిఫ్టీ-50లో 40 స్టాక్స్ లాభాలు గడించాయి. నిఫ్టీలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హీరో మోటో కార్ప్, టీసీఎస్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో లాభ పడగా, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివిస్ ల్యాబ్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బీపీసీఎల్ సహా పది నిఫ్టీ స్టాక్స్ పతనం అయ్యాయి.
ఎన్ఎస్ఈలో 11 సెక్టార్ల ఇండెక్స్ల్లో 10 లబ్ధి పొందగా, ఒకటి మాత్రం నష్టపోయింది. ఐటీ ఇండెక్స్ 2.50 శాతం, ఆటో, పీఎస్ యూ బ్యాంక్ ఇండెక్స్ రెండు శాతానికి పైగా, ఫార్మా, ప్రైవేట్ బ్యాంక్ సెక్టార్ ఒకశాతానికి పైగా లాభ పడ్డాయి. బ్యాంక్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాల్టీ ఇండెక్స్లు పుంజుకోగా, మెటల్ సూచీ స్వల్పంగా నష్టపోయింది.